జెనీవా: పోలియో, మశూచి లాంటి అతిపెద్ద మహమ్మారులను జయించిన భారత్.. ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు హెచ్ఓ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ గుర్తు చేశారు. తాజాగా శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్19)ను కట్టడి చేసే శక్తి మన దేశానికి ఉందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే వైరస్ విజృంభిస్తున్న ప్రదేశాల్లో వైద్య పరీక్షా సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కరోనా కట్టడిని సులభమైన పరిష్కారాలు లేవని, భారత్ లాంటి దేశాలే మార్గదర్శకంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ వంటి అత్యంత జనసాంద్రత ఉన్న దేశాల్లోనే కరోనా వైరస్ కట్టడిని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 16 వేల మందికి పైగా ప్రజలు కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు.
మరోవైపు బాధితుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. దీంతో అన్ని దేశాలు మరింత కఢినమైన, వేగవంతమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని డబ్లుహెచ్ఓ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆటు భారత్లో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమించాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంభించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. ప్రస్తుతానికి దేశంలో దాదాపు 450 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా మరో 34 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు.