మనతెలంగాణ/ సిటిబ్యూరో : కరోనా వైరస్ వ్యాపించకుండా లాక్డౌన్ విధించడంతో మందుబాబులకు కష్టాలు మొదలయ్యాయి. వైన్, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయడంతో మందుబాబుల మతిపోతోంది. రోజు తాగే అలవాటున్న వారు కావడంతో వారికి పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. వీరంతా వరసుగా ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రికి క్యూకడుతున్నారు. గతంలో రోజు 30 నుంచి 40మంది వచ్చేవారు. అందులో నాలుగు కేసులు మద్యానికి బానిసగా మారిన వారి కేసులు ఉండేవి. లాక్డౌన్ అయిన తర్వాత వీరి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే 100 కేసులు మద్యానికి సంబంధించినవి వచ్చాయి.
ఈ విధంగా నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో దాదాపుగా 200మంది చేరినట్లు తెలిసింది. మందుబాబులకు సాయంత్రం వరకు చుక్క పడకపోయేసరికి వారి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసగా మారిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చింతల్ బస్తీలో మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ముందుగా ఎలాంటి సూచనలు ఇవ్వకుండా మందు షాపులను మూసివేయడంతో ఎక్కడా మద్యం లభించడంలేదు. నగరంలో రెండు గం టల పాటు వైన్ షాపులు తెరుస్తారని సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో పలువురు వైన్ షాపుల వద్ద నిలుచున్నారు. తీరా షాపులు తెరవకపోవడంతో వైన్షాపులకు వెసిన తాళాలను పగులగొట్టేందుకు యత్నించారు.
చోరీకి యత్నం…
నగరంలో పలుచోట్ల మద్యం కోసం చోరీలు చేసేందుకు యత్నించారు. మద్యం షాపులు తెరవకపోవడంతో వాటి తాళాలు పగుల గొట్టి మద్యాన్ని చోరీ చేస్తున్నారు. కొన్ని చోట్ల వైన్షాపుల యజమానులే షాపుల నుంచి అర్ధరాత్రి తరలించి వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నా చారంలోని వైన్షాపు యజమాని తన షాపు నుంచి మ ద్యాన్ని అర్ధరాత్రి తరలిస్తు అక్కడ ఉన్న సిసి కెమెరాకు చి క్కాడు. దొరికిన చోట విపరీతమైన ధరలు చెబుతున్నారు.
పెరిగిన మద్యం కేసులు : డాక్టర్ ఉమాశంకర్
2 రోజుల నుంచి ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు ఒపి కేసులు పెరిగాయని ఎర్రగడ్డ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ తెలిపారు. ఇక్కడికి వచ్చే కేసుల్లో ఎక్కువగా క్లోరోఫామ్, డైజోఫామ్ వాడడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని, వారిని చేర్చుకుని చికిత్స చేస్తున్నామని తెలిపారు. ప్రతి రోజు మద్యం,కల్లు తాగే అలవాటు ఉన్న వారు ఒక్కసారిగా తాగడానికి మద్యం దొరకకపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్నారని ఆయన వెల్లడించారు.