మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కరోనా క్రైసెస్ ఛారిటీ మనకోసం (సిసిసి)కి తనవంతు సాయంగా ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు 10 లక్షల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “సిసిసికి రామోజీరావు పది లక్షల రూపాయలను అందజేశారు. దీంతో ఆయనకు ఫోన్ చేసి ‘మీలాంటి వాళ్లు మేము చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించడమే కాకుండా ప్రోత్సహిస్తూ పది లక్షల రూపాయలను ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’ అన్నాను. దీనికి ఆయన ‘మీరు చేసే కార్యక్రమాలను, ఇంటింటికి నిత్యావసర సరుకులను సరఫరా చేసే విధానాన్ని గమనిస్తున్నాను. చాలా బాగా చేస్తున్నారు. అయినా నేను ఇచ్చింది చాలా చిన్న మొత్తమే. మీరు నిజాయితీగా పనిచేస్తున్నారు’ అంటూ రామోజీరావు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉత్సాహపరిచారు. వారికి ప్రత్యేకించి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకోవడం కూడా జరిగింది. మా సిసిసి సభ్యులందరి తరపున మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను”అని అన్నారు.