మూడు నెలల బిల్లు రూ.7 లక్షలు
ప్రతి నెలా వచ్చేది రూ.500ల లోపే
హైదరాబాద్: కరెంట్ బిల్లులపై ఇప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, తాజాగా కామారెడ్డిలోని ఇస్రోజివాడ గ్రామానికి చెందిన ఓ ఇంటి యాజమానికి రూ.7 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. లాక్డౌన్ నేపథ్యంలో ఇన్నిరోజులు ప్రభుత్వం మీటర్ రీడింగ్తో బిల్లులు తీయలేదు. ఇప్పుడు మూడు నెలలకు సంబంధించి ఒకేసారి బిల్లు తీయడంతో వచ్చిన అమౌంట్ చూసి ఆ యాజమాని అవాక్కయ్యారు. సాధారణంగా ఓ ఇంట్లో మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు మాత్రమే నడిస్తే ప్రతినెలా రూ.500 మేర బిల్లు వస్తుంది.
అయితే రూ.7 లక్షలు రావడంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు గురవుతున్నాడు. కామారెడ్డి జిల్లా విద్యుత్ అధికారుల నిర్లక్షమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గత ఫిబ్రవరి నెలలో ఇంటి యాజమాని గాండ్ల శ్రీనివాస్ రూ.415 విద్యుత్ బిల్లు చెల్లించాడు. మార్చి, ఏప్రిల్, మే నెలలో కరోనా నేపథ్యంలో విద్యుత్ బిల్లులు రాలేదు. ఈ నెల వచ్చిన విద్యుత్ బిల్లులో మూడు నెలలకు కలిపి రూ.2 వేల లోపు బిల్లు వస్తుందనుకుంటే ఏకంగా రూ.7 లక్షల 29 వేల 471 వచ్చింది.