న్యూఢిల్లీ : ప్రపంచంలో అనేక దేశాలు కరోనా మహమ్మారి బారి నుంచి రక్షించుకోడానికి లాక్డౌన్తోసహా అనేక కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రం గానే ఉంటున్నాయి. 150 కోట్ల జనాభా కలిగిన భారత్లో ఒకవైపు కేసులు, మరణాలు పెరుగుతుండగా, 50 లక్షల జనాభా కలిగిన న్యూజిలాండ్ దేశం కరోనాను ఏ విధంగా నియంత్రించ గలిగిందన్నది చర్చనీయాంశంగా మారింది. ఆ దేశం విధానాలను పరిశీలిస్తే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే విజయం సాధించ గలిగింది. మార్చి 15 నే విదేశీయుల ప్రవేశాన్ని నిషేధించింది. స్వదేశీయులను మాత్రమే అనుమతించింది. అలా వచ్చిన వారికి 14 రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి చేసింది.
మార్చి 25 న ఆ దేశంలో లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలు లోకి వచ్చింది. లాక్డౌన్ నాలుగో దశలో నిత్యావసరాలు, జౌషధ దుకాణాలు, ఆస్పత్రులు, గ్యాస్ స్టేషన్లను మాత్రమే తెరిచి ఉంచారు. మిగతా షాపులకు వీలు కల్పించ లేదు. వాహనాల రాకపోకలను పూర్తిగా నిరోధించారు. ఏప్రిల్ 27న లాక్డౌన్ నాలుగు నుంచి మూడో దశకు మార్చారు. అప్పటికి 19 మందే మృతి చెందారు. కేసులు సంఖ్య 1472 కు చేరింది. కరోనా పరీక్షలను వేగంగా ముమ్మరంగా సాగించారు. ఒక మిలియన్ జనాభాకు అత్యధికంగా పరీక్షలు చేసిన దేశంగా న్యూజిలాండ్ రికార్డు సాధించింది.
తక్కువ జనసాంద్రత కలిగిన ద్వీపకల్పం కావడంతో కరోనా ఉద్ధృతంగా విస్తరించడానికి అవకాశం కలగలేదు. ఇవన్నీ ఒక ఎత్తు ఆ దేశ ప్రధాని ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ అప్రమత్తం చేయడం మరోఎత్తు. కలసికట్టుగా కరోనా కష్టాలను అందరికన్నా మనం ముందుగా అధిగమిద్దాం అని ఆయన ఇచ్చిన నినాదం ప్రజలను అమితంగా ఆకట్టుకుని కర్తవ్యబద్ధుల్ని చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.