ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అనుకున్నంత తేలికకాదని భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్లోనే ధోనీ చాలా ప్రత్యేకమైన క్రికెటర్ అన్నాడు. వికెట్ కీపర్గా, మ్యాచ్ ఫినిషర్గా, కెప్టెన్గా ధోనీ తన బాధ్యతలను చాలా సక్రమంగా నిర్వర్తించాడన్నాడు. అతనిలాంటి క్రికెటర్ దొరకడం చాలా కష్టమన్నాడు. ప్రస్తుతం ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం టీమిండియాకు చాలా కష్టంతో కూడుకున్న విషయమన్నాడు. ఇక ప్రస్తుతం ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్లు సిద్ధంగా ఉన్నారన్నాడు.
పంత్కు ఇప్పటికే కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చారన్నాడు. అయితే వాటిని అతను సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడన్నాడు. ధోనీలా ఆడడం ఎవరికీ సాధ్యం కాదని అయితే అందులో సగం సత్తా ఉన్నా సరిపోతుందన్నాడు. ప్రపంచ క్రికెట్లోని దిగ్గజ ఆటగాళ్లలో ధోనీ ఒకడని, అతని స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి తరం కాదన్నాడు. పంత్, రాహుల్ల మధ్య ప్రస్తుతం గట్టి పోటీ నెలకొందన్నాడు. ఇందులో ఎవరూ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారో ఇప్పుడే చెప్పలేమన్నాడు. రానున్న రోజులు వీరిద్దరికి చాలా కీలకమని రాథోడ్ పేర్కొన్నాడు. ఓ ఇన్స్టా లైవ్లో పాల్గొన్న విక్రమ్ ఈ విషయాలు వెల్లడించాడు.