సౌతాంప్టన్: ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ విజయవంతంగా ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్లో కొత్త జోష్ నెలకొందని చెప్పాలి. కరోనా భయం పట్టిపీడిస్తున్న ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ఎలాంటి ఆటంకంగా లేకుండా సాఫీగా సాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ సిరీస్లు జరిగేందుకు ఇది దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తొలి మ్యాచ్ కోసం తీసుకున్న జాగ్రత్తలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. బయో సెక్యూర్ విధానంలో ఈ మ్యాచ్ను అత్యంత విజయవంతంగా నిర్వహించి ఇంగ్లండ్ బోర్డు ఇతర బోర్డులకు ఆదర్శంగా నిలిచింది. ఇంగ్లండ్ను స్ఫూర్తిగా తీసుకుని ఇతర క్రికెట్ బోర్డులు కూడా అంతర్జాతీయ సిరీస్ల నిర్వహణకు ముందుకు వచ్చే మార్గం సుగమం అయ్యిందనే చెప్పాలి. మిగిలిన రెండు టెస్టు మ్యాచ్లు కూడా విజయవంతంగా ముగిస్తే అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ గాడిలో పడడం ఖాయం. కరోనా కారణంగా చాలా రోజులుగా క్రికెట్ ఎక్కడికక్కడే నిలిచి పోయింది. ఇంగ్లండ్ కూడా కరోనా బాధిత దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ కూడా ఓ సమయంలో కరోనా విలియతాండవం చేసింది. పరిస్థితులు చూస్తే ఇంగ్లండ్లో ఇప్పటికిప్పుడూ సాధారణ పరిస్థితులు నెలకొనడం అసాధ్యంగా కనిపించింది. కానీ, అక్కడి ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలతో పరిస్థితి త్వరగానే అదుపులోకి వచ్చింది. ఇదే సమయంలో ఇంగ్లండ్ ప్రభుత్వం ఎంతో ధైర్యంతో పలు నిర్ణయాలు తీసుకుంది.
ఒకవైపు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్కు అనుమతి ఇచ్చింది. క్రికెట్ మ్యాచ్లు నిర్వహించుకునేందుకు క్రికెట్ బోర్డుకు అనుమతులు మంజూరు చేసింది. ఇక, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను చక్కగా వినియోగించుకుంది. ఇరు జట్ల ఆటగాళ్లకు పూర్తి రక్షణ కల్పించడంలో బోర్డు అధికారులు తీసుకున్న జాగ్రత్తలను ఎంత పొగిడినా తక్కువే. అత్యంత క్లిష్టమైన సమయంలో ధైర్యంతో సిరీస్ నిర్వహణకు ముందుకు రావడమే రాకుండా ఒక టెస్టు మ్యాచ్ను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అందరి మనసులను గెలుచుకుంది. ఇతర క్రికెట్ బోర్డులు కూడా మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఇది దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. కరోనా వల్ల పూర్తిగా చతికిల పడిపోయిన క్రికెట్కు తొలి టెస్టు మ్యాచ్ విజయవంతం కావడం అత్యంత పెద్ద ఊరట కల్పించిందనే చెప్పాలి.
West Indies won in 1st Test against England