లడ్డూ వేలం కూడా నిర్వహించం
దర్శనానికి భక్తులకు అనుమతి లేదు
బాలాపూర్ ఉత్సవ సమితి నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఈసారి ఖైరతాబాద్ గణేశుడితో పాటు బాలాపూర్ గణేశుడి ఎత్తు తగ్గించాలని ఆయా ఉత్సవ కమిటీలు నిర్ణయించారు. ఇప్పటికే ఎత్తు విషయంతో పాటు విగ్రహంలో పలు మార్పులు, చేర్పులు చేపట్టినట్టు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ప్రకటించగా, అదేబాటలో బాలాపూర్ కమిటీ సైతం ఈసారి 6 అడుగుల ఎత్తులోనే గణేశుడిని ప్రతిష్టించనున్నట్టు ఉత్సవ కమిటీ తెలిపింది. ఉత్సవాల నిర్వహణపై గురువారం బాలాపూర్ ఉత్సవ కమిటీ సమావేశమై కొన్ని అంశాలపై చర్చించింది. అందులో భాగంగా ఇక్కడ ప్రతిష్టించే 21 అడుగుల గణేశ్ విగ్రహానికి బదులు 6 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించాలని, ప్రతి సంవత్సరం నిర్వహించే లడ్డూ వేలం ఈ సంవత్సరం నిర్వహించవద్దని గణేశ్ ఉత్సవ కమిటీ సూచించినట్టుగా తెలిసింది.
దీంతోపాటు ఈ సంవత్సరం మొదటి పూజ కేవలం కమిటీ ఆధ్వర్యంలోనే జరపాలని, ఈ సంవత్సరం భక్తులకు ఎలాంటి పూజలు, దర్శనాలు అనుమతించవద్దని నిర్ణయించినట్టుగా కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే గణేష్ శోభాయాత్రకు మాత్రం ప్రభుత్వ అనుమతులు మేరకు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఉత్సవ సమితి నిర్ణయించింది. ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా భక్తులందరూ సహకరించాలని ఉత్సవ సమితి విజ్ఞప్తి చేసింది. అయితే బాలాపూర్ గణేశ్ ఉత్సవాల్లో లడ్డూ వేలానికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.17.60 లక్షల ధర పలికింది.
నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహిస్తాం: భాగ్యనగర్ ఉత్సవ కమిటీ
కేంద్ర, రాష్ట్ర నిబంధనలకు లోబడి గణేశ్ ఉత్సవాలు నిర్వహించు కుంటామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. భక్తులు, ప్రజలు కూడా తమకు సహకరించాలని ఈ ఉత్సవ కమిటీ పిలుపునిచ్చింది.
Balapur Ganesh 6 feet only this year