అరెస్ట్ చేయకుండా వదిలేసిన కోల్కతా పోలీసులు
కోల్కతా : మూడేళ్లుగా అజ్ఞాతంలో గడిపిన గోర్ఖా జనముక్తి మోర్చా(జిజెఎం) అధినేత బిమల్ గురుంగ్ ఆకస్మికంగా కోల్కతాలో ప్రత్యక్షమయ్యారు. కోల్కతా శివారు ప్రాంతం సాల్ట్లేక్లోని గోర్ఖా భవన్ అతిథి గృహం ముందు బుధవారం కనిపించారు. మీడియాతో మాట్లాడేందుకు వచ్చినట్టుగా భావిస్తున్నారు. అయితే, అతిథి గృహంలోకి అధికారులు ఆయణ్ని అనుమతించలేదు. దాంతో, కారులో కాసేపు కూర్చొని అక్కడి నుంచి వెళ్లారు. పోలీసులు అక్కడే ఉన్నా బిమల్ను అరెస్ట్ చేయకుండా వదిలేయడం గమనార్హం.
2017 సెప్టెంబర్ నుంచి బిమల్ అజ్ఞాతంలోనే ఉంటున్నారు. గోర్ఖాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్తో జిజెఎంను ఏర్పాటు చేశారు. బిమల్పై 150కిపైగా కేసులున్నాయి. ఉగ్రవాద నిరోధక చట్టం యుఎపిఎ కింద ఆయనపై బెంగాల్ ప్రభుత్వం లుకౌట్ నోటీస్ జారీ చేసింది. జిజెఎం మద్దతుదారుల దాడిలో ఓ పోలీస్ మరణించిన తర్వాత బిమల్ అజ్ఞాతంలోకి వెళ్లారు. జిజెఎంలో బిమల్ పట్ల వ్యతిరేకతతో ఉన్న బినయ్ తమాంగ్ అనే మరో నేత బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి అనుకూలుడుగా భావిస్తారు. బినయ్ తమాంగ్ ప్రస్తుతం జిజెఎం చీలికవర్గం నేత. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ను బినయ్ వదిలేశారు.