గురు, శని గ్రహాల మహా కలయిక
800 ఏళ్ల తర్వాత అతి దగ్గరగా…
కోల్కతా: ఈ నెల 21న ఆకాశంలో ఓ అద్భుతం జరగనున్నది. సౌర కుటుంబంలోని భారీ గ్రహాలైన గురు, శని గ్రహాలు అతి దగ్గరగా రానున్నాయి. భూమి నుంచి 0.1 డిగ్రీల కోణంలో రెండూ ఒక్కటిగా కనిపించనున్నాయి. దీనిని మహా కలయికగా ఖగోళ శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. ఇలాంటి మహా కలయిక 800 ఏళ్ల క్రితం 1226 మార్చి 4న జరిగింది. తిరిగి 2080 మార్చి 15న జరగనున్నది. 21న భారత్లోని ప్రధాన నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత ఈ మహా కలయికను చూడవచ్చునని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. రెండూ దగ్గరయ్యే సందర్భంలో కాంతిమంతంగా కనిపిస్తాయని చెబుతున్నారు.
సౌర కుటుంబంలోనే అతిపెద్దదైన గురుగ్రహం సూర్యుని నుంచి ఐదోది, భూమి నుంచి రెండోది, రెండో అతిపెద్ద గ్రహమైన శని సూర్యుని నుంచి ఆరోది, భూమి నుంచి మూడోది. ఇవి రెండూ దగ్గరగా రావడమంటే సాధారణ దూరం కంటే దగ్గరగా వస్తున్నాయి. అయినా, ఈ నెల 21న వాటి మధ్య దూరం 73 కోట్ల 50 లక్షల కిలోమీటర్లమేర ఉంటుంది. నక్షత్రాల మధ్య దూరాలతో పోలిస్తే ఈ దూరం చాలా చిన్నది. మనకు అతి సమీప నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ దాదాపు 40 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నది.