Tuesday, May 14, 2024

అకాల వర్షాలతో పండ్లతోటలకు భారీ నష్టం

- Advertisement -
- Advertisement -

Huge damage to Fruit orchards with untimely Rains

నేలరాలిన మామిడి..తడిసిముద్దయిన ధాన్యం
60వేల ఎకరాల్లో పంటనష్టం
మరో రెండు రోజులు వర్షాలే

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు పండ్లతోటలకు భారీ నష్టం కలిగించాయి. ఉపరి తల ఆవర్తనం కారణంగా మంగళవారం రాత్రి ఉన్నట్టుండి ఉరుములు ,మెరుపులతో కురిసిన వర్షం కారణంగా వ్యవసాయరంగానికి నష్టం వాటిల్లింది. చినుకుల ధాటికి చాలా జిల్లాల్లో వరిపైర్లలో గింజలు జలజల నేలరాలయి. వరి కోతల అనంతరం ఆరుబయట ఆరబెట్టినధాన్యం రాసులు తడిసిపోయాయి. పండ్లతోటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. మామిడితోటల్లో కాపుమీద ఉన్న చెట్లనుంచి కాయలు నేలరాలాయి. వివిధ జిల్లాల నుంచి అందిన ప్రాధమిక సమాచారాన్ని బట్టి 50వేల ఎకరాల్లో వరిపైర్లకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. అదే విధంగా ఆరుబయట ఆరబెట్టిన ధాన్యం తడిసిన కారణంగా నష్టం ఎంత అన్నది అంచనా వేస్తున్నారు. మిరప పంటకు కూడా నష్టం వాటిల్లింది.

పది వేల ఎకరాల్లో పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయిలో పంటనష్టం వివరాలు సేకరిస్తున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజులపాటు ఇదేవిధమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉరుములు ,మెరుపులు , గంటకు 50కిలోమీటర్ల వేగంగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని , కోతల అనంతరం ధాన్యం తడవకుండా పట్టాలు సిద్దంగా ఉంచుకోవాలని, వరి కోతల విషయంలో కూడా వాతావరణ సూచనలు బట్టి నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు.

ఇల్లందులో అత్యధికంగా 55 మి.మి వర్షం

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇల్లెందులో అత్యధికంగా 55.2 మి.మి వర్షం కురిసింది. మోమిన్‌పేటలో 54, ఖానాపూర్‌లో 43.2 చెన్నారావు పేటలో 43, హత్నూర్‌లో 41.6, దోమలో 40.4,నర్సాపూర్‌లో 38, కౌడిపల్లిలో 37, కొత్తకోటలో 36.4, హుజూరాబాద్‌లో 36.3 , ఇటిక్యాల్‌లో 35.5, యాదగిరిగుట్టలో 34.8, పోచంపల్లిలో 34.2, మక్తల్‌లో 34, పరిగిలో 33.2, చిన్నచింతకుంటలో 33.2, టేకులపల్లిలో 32, మహబూబ్‌నగర్‌లో 29, గోల్కొండలో 28, బచ్చన్‌పేటలో 27.4, వర్ణిలో 26.8, నర్సంపేటలో 26.2, సంగారెడ్డిలో 25.4, పాలకుర్తిలో 24.4, నర్మెట్టలో 23.6, వికారాబాద్‌లో 22.6, పర్వతగిరిలో 22.2, నవాబ్ పేటలో 21.8,జమ్మికుంటలో 21.7, కొండుర్గ్‌లో 21.6, సదాశివపేటలో 21.4, పరకాల్‌లో 21, రైకోడ్‌లో 21, కొహిర్‌లో 21, మహబూబాబాద్‌లో 20.4 మి.మివర్షం కురిసింది. భువనగిరి , హసన్‌పర్తి, శేరిలింగంపల్లి, బయ్యారం, గోవిందరావుపేట, ములుగు, హన్మకొండ, నిజామబాద్, రామచంద్రాపురం, చేవెళ్ల, కొసిగి, కొడంగల్, జనగామ్ , కొత్తగూడ, గండిపేట్, కొత్తగూడెం, చెన్నూరు కేంద్రాల్లో 10మి.మి పైగా వర్షం కురిసింది. వరంగల్ , బూర్గం పహడ్, తాండూర్ , జడ్చర్ల, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్, హకీంపేట్, దిండిగల్, హైయత్ నగర్, మొయినాబాద్ ,పినపాక ,వనపర్తి, మెదక్ ,అశ్వారావుపేట, బాన్స్‌వాడ, డొర్నకల్ ,గజ్వేల్ తదితర ప్రాంతాల్లో ఒకమోస్తరు వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News