రాహుల్ గాంధీ ఆరోపణ
కన్నూర్: దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశం ఇప్పుడు ఒక సంక్లిష్టమైన కూడలిలో ఉందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు తీసుకువస్తున్న శక్తులపై పోరాడాల్సిన నైతిక బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీపై ఉందని రాహుల్ అన్నారు. గురువారం కేరళలోని కన్నూర్ జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ప్రారంభోత్సవంలో వర్చువల్ పద్ధతిలో పాల్గొన్న రాహుల్ ప్రసంగిస్తూ మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించిందని, గడచిన 70 సంవత్సరాలలో నిర్మించుకున్న వ్యవస్థలను మోడీ తన కొద్దిమంది స్నేహితులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ ప్రవేటీకరణకు వ్యతిరేకం కాదని, కాని దానికి కూడా ఒక హేతుబద్ధత ఉండాలన్నదే తమ వాదనని ఆయన అన్నారు. కీలకమైన పరిశ్రమలను కాంగ్రెస్ గతంలో ప్రైవేటుపరం చేయలేదని, ఉదాహరణకు భారతదేశానికి వెన్నెముక లాంటి రైల్వేలను తాము ప్రైవేటుపరం చేయలేదని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.6 లక్షల కోట్ల జాతీయ మానిటైజేషన్ పైప్లైన్ను ఆయన దుయ్యబట్టారు. దేశంలో ఇంధనం ధరల పెరుగుదలపై ఆయన కేంద్రవైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు.