Tuesday, April 30, 2024

దేశ దేశాల పెట్టుబడుల గమ్యం తెలంగాణ

- Advertisement -
- Advertisement -

Minister KTR addressed European Business Group online conference

టిఎస్‌ఐపాస్ పట్ల ప్రశంసల వర్షం, ఇప్పటికే ఐటి లైఫ్‌సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి 14రంగాల్లో రాష్ట్రం ముందంజ

యూరప్ దేశాల పెట్టుబడులకు తెలంగాణ
ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది భారత జిడిపికి
రాష్ట్రం అధిక వాటాను అందిస్తోంది రాష్ట్రం
చేపట్టిన నూతన కార్యక్రమాలకు దేశంలో వివిధ
వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి
రాష్టానికి వచ్చే కంపెనీ అవసరాల మేరకు స్థలం
కేటాయిస్తాం : యూరోపియన్ బిజినెస్ గ్రూప్
ఆన్‌లైన్ సమావేశంలో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ పాలసీల వల్ల గత ఏడు సంవత్సరాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. భారతదేశ జిడిపికి తెలంగాణ రాష్ట్రం తరఫున గణనీయమైన వాటాను అందిస్తుందని తెలిపారు. యూరోపియన్ బిజినెస్ గ్రూప్ బుధవారం నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. యూరప్,భారతదేశానికి చెందిన పలు కంపెనీల ప్రతినిధులు వ్యాపార వర్గాలు, రాయబార కార్యాలయాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కె.టి.రామారావు యూరోపియన్ వ్యాపార వాణిజ్య వర్గాలకు తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలతో పాటు ఇక్కడి వ్యాపార అనుకూలతలను వివరించారు. యూరప్ వ్యాపార వాణిజ్య వర్గాలను చేరుకుని, తెలంగాణ గురించి వివరించేందుకు సహకరించాలని ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ గురించి తమకు సానుకూల సమాచారం ఉందని, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాలసీలు, ముఖ్యంగా అనుమతుల ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకమైన సానుకూల ఫీడ్‌బ్యాక్ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ప్రస్తావించారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టిఎస్‌ఐపాస్ విధానం గురించి వివరించారు. టిఎస్‌ఐపాస్ విధానంలో ఉన్న ప్రత్యేకతలను తెలియజేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెట్టుబడులకు అనుకూలమైన పాలసీలతో పాటు వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక వినూత్నమైన కార్యక్రమాలకు, దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి వస్తున్న ప్రశంశలను వివరించారు. తాము చేపట్టిన టిఎస్‌ఐపాస్ తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షణనీయ గమ్యస్థానంగా మార్చడంలో విజయం సాధించిందని ఈ సందర్భంగా, టిఎస్‌ఐపాస్ ద్వారా సాధించిన విషయాల తాలూకు గణాంకాలను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. మంత్రి కెటిఆర్ తన ప్రసంగం తర్వాత ఆయా ప్రతినిధులు వివిధ అంశాలపైన అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఐటి, లైఫ్ సైన్సెస్, ఫార్మా ,ఏరోస్పేస్ ,డిఫెన్స్, టెక్స్టైల్స్ ,ఫుడ్ ప్రాసెసింగ్ వంటి 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా ఎంచుకుని ఆయా రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం స్థానికంగా ఉన్న రాష్ట్రాలతోనే కాకుండా ఈ రంగాల్లో దూసుకు వెళ్తున్న వివిధ దేశాలతోనూ పోటీ పడేందుకు సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించి భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ ఫార్మా సిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ , మెడికల్ డివైస్ పార్క్ వంటి అంశాలను ప్రస్తావించారు.

కంపెనీ అవసరాల మేరకు ప్రభుత్వ స్థలం కేటాయింపు

రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చి ఏ వ్యాపార సంస్థకైనా ఆయా కంపెనీ అవసరాల మేరకు, పెట్టుబడి మేరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు.. తెలంగాణ వద్ద పరిశ్రమలకు అవసరమైన స్థలం సిద్ధంగా ఉందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వద్ద ఉన్న లాండ్ బ్యాంక్ గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం మౌలిక వసతులు సదుపాయాల కల్పనకు మాత్రమే కాకుండా మానవ వనరుల అభివృద్ధి, వారి శిక్షణకు సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగానే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వమే తన ఖర్చుతో శిక్షణ కార్యక్రమాలను చేపట్టి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇప్పటికే తెలంగాణలో అమెరికా, జపాన్, కొరియా, చైనా, కొరియా, తైవాన్ వంటి దేశాలకు చెందిన పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, అనేక యూరోపియన్ కంపెనీలు కూడా అత్యంత సౌకర్యవంతంగా తమ కార్యకలాపాలను తెలంగాణలో కొనసాగిస్తున్న విషయాన్ని మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలను వ్యాపార అనుకూలతను ఇక్కడి పెట్టుబడి అవకాశాలను యూరోపియన్ వ్యాపార వాణిజ్య సంస్థలకు తెలియజేసేందుకు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ప్రయత్నించాలని మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News