నెక్లేస్ రోడ్లో విద్యుత్ వాహనాల ప్రదర్శన
హైదరాబాద్ : ప్రసుత్త రవాణా అవసరాలకు విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. టిఎస్ రెడ్కో ఆధ్వర్యంలో శనివారం నెక్లేస్ రోడ్ లో విద్యుత్ వాహనాల ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యుత్ తో నడిచే వాహనాలను ఆయన స్వయంగా నడిపించారు. టిఎస్ రెడ్కో విసి,ఎండి యన్. జానయ్య అధ్యక్షత జరిగిన అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణం ప్రపంచానికి సవాల్ విసురుతున్న నేపధ్యంలో విద్యుత్ వాహనాలు వాడకంలోకి రావడాన్ని ఆయన స్వాగతించారు. మనం సృష్టిస్తున్న సమస్యలతో పర్యావరణం సమస్య ఉత్పన్నం అవుతుందన్న వాస్తవాన్ని గుర్తించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పెట్రోలియం ఉత్పత్తులతో పెరిగిన కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలన్నారు. అందుకు విద్యుత్ వాహనాల వినియోగం తప్పనిసరి అవుతుందన్నారు.
విద్యుత్ వాహనాల వినియోగంలో ఎటువంటి అపోహలకు తావు లేదన్నారు. పర్యావరణ సమతుల్యం కోసం సిఎం కెసిఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తుచేశారు..ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా కొనసాగుతుందన్నారు. విద్యుత్ వాహనాల డిమాండ్కు తగినట్లుగా పంపిణీ లేకపోయినప్పటికీ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వాహనాల రిపేరింగ్, ఛార్జింగ్పై అపోహలకు ఆస్కారం లేదన్నారు.ఇప్పటి వరకు 136 ఛార్జింగ్ కేంద్రాలను ప్రారంభించమన్నారు. ఇకపై జాతీయ రహదారుల అన్నింటి మీద ఛార్జింగ్ స్టేషన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి జగదీష్రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, బిఇఇడిజి అభయ్ బక్రే, రెడ్కో చైర్మన్ జనాబ్ సయ్యద్ అబ్దుల్ అలిమ్, రెడ్కో జియం జియస్వి ప్రసాద్, పవర్ గ్రిడ్ ఇడి అనూప్కుమార్,సిజేయం అనిల్కుమార్,ఇఇయస్ఎల్ జియం సావిత్రిసింగ్ పాల్గొన్నారు.