యుపిలో సరయూ కెనాల్ను ప్రారంభిస్తూ ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కొందరు రిబ్బన్లు కత్తిరించడానికే పరిమితమవుతారు, తాము మాత్రం చేపట్టిన ప్రాజెక్టుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఉత్తర్ప్రదేశ్లో సరయూ కెనాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలోనే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయని ఎస్పి అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ అన్న మాటలకు ప్రధాని కౌంటరిచ్చారు. శనివారం యుపిలోని బలరామ్పూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీనుద్దేశిస్తూ ప్రధాని ప్రసంగించారు. గత ప్రభుత్వాల అలసత్వానికి దేశం 100 రెట్లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నదని ప్రధాని అన్నారు. రూ.4600 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాజెక్ట్ను గత నాలుగేళ్లలో పూర్తి చేయడానికి రూ.9800 కోట్లు ఖర్చయ్యాయని ప్రధాని గుర్తు చేశారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా 14 లక్షల హెక్టార్లకు నీరందుతుందని, 29లక్షలమంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని అన్నారు. తూర్పు యుపిలోని ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందనున్నది. ఈ కెనాల్ ప్రాజెక్ట్ ద్వారా ఘాఘ్రా, సరయు,రాప్తీ, బంగానా,రోహిణీ నదుల్ని అనుసంధానం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్ను ప్రధాని మోడీ గుర్తు చేస్తూ, ఆయన మరణం దేశానికి తీరనిలోటన్నారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు.