సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు మండలం, ఇస్నాపూర్ శివారులో గల మహేశ్వర మెడికల్ కళాశాల, ఆసుపత్రిలో శుక్రవారం వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…రామచంద్రాపురం మండలం, తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన ముంతాజ్ (55) గత మూడేళ్లుగా కడుపునొప్పితో పొట్ట పెరగటం వంటి సమస్యలతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు చాలా ఆసుపత్రులలో చూపించినప్పటికీ సరైన చికిత్స లభించక పోవటం, ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమెకుకు థైరాయిడ్, బిపి వంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఎడమ అండాశయంలో 15 కిలోల కణితి పెరిగి సమస్య తీవ్రమైనదిగా వైద్యులు గుర్తించారు. గత 12 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందుబాటులో ఉండేలా అతి తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న మహేశ్వర మెడికల్ కళాశాల యాజమాన్యం ముంతాజ్ విషయంలో
తమ వంతు సామాజిక బాధ్యతగా అతి తక్కువ ఖర్చులోనే వైద్యాన్ని అందించడానికి ముందుకు వచ్చింది. ముంతాజ్ వయసు, ఆరోగ్యం దృష్ట్యా శస్త్రచికిత్స ప్రమాదకరం అయినప్పటికీ రిస్క్ తీసుకుని లాపరోటమీ ద్వారా తన అండాశయంలో పెరిగిన 15 కిలోల కణితిని తొలగించి గర్భసంచి ఆపరేషన్ చేశామని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆడమ్ తెలిపారు. పేదలకు అతి తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సని అందించడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని, పేదలకు ఎటువంటి వైద్య చికిత్సనైనా తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామని చెప్పారు. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ హేమంత్, డాక్టర్ భావనారెడ్డి, ఆంకాలజీ విభాగం డాక్టర్ శంకర్ రెడ్డి, సర్జరీ విభాగం డాక్టర్ సూర్యతేజ, స్త్రీల వైద్య విభాగం డాక్టర్ అరుణ, డాక్టర్ అపర్ణ, డాక్టర్ సుప్రియ, డాక్టర్ శివలత, డాక్టర్ ఆకాంక్ష తదితర నిపుణులు పాల్గొన్నారు.