మణిపూర్లో శుక్రవారం గుర్తుతెలియని సాయుధులు తెగబడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలో సాయుధులు కాపుకాసి అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.అయిదుగురు గాయపడ్డారు. ఇంఫాల్ నుంచి వాహనశ్రేణి వెళ్లుతుండగా నంబోయి సబాల్ లీకాయ్ వద్ద దాడి ఘటన జరిగింది. ఈ ప్రాంతం రాజధాని ఇంఫాల్ శివార్లలోనే ఉంది. అక్కడి నంబోల్ బేస్ నుంచి కాన్వాయ్ వెళ్లుతుండగా సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సాయుధులు దాడికి దిగారు. ఇంఫాల్, చురాచంద్పూర్ మధ్యలోనే ఈ దాడి ఘటన ప్రాంతం ఉంది. ప్రధాని మోడీ గత వారమే మణిపూర్ పర్యటనకు ప్రత్యేకించి ఈ రెండు ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. కాన్వాయ్ను ఈ ప్రాంతంలోనే మరీ ఎంచుకుని దాడి జరిపినట్లు వెల్లడైంది.
గాయపడ్డ అస్సాం రైఫిల్ జవాన్లను వెంటనే ఇంఫాల్లోని రిమ్స్కు చికిత్సకు తరలించారు. మణిపూర్ రక్షిత ప్రాంతంలో ఉగ్రవాదులు దాడికి దిగారని , వారిని ఎదుర్కొనేందుకు జవాన్లు ఎదురుకాల్పులు సాగించారని ఈ క్రమంలో జవాన్లు మృతి చెందారని రైఫిల్స్ అధికారి ఒకరు తెలిపారు. దాడికి ఇప్పటివరకూ ఏ సంస్థ బాధ్యత వహించలేదు. ఈ ఘటనను మణిపూర్ గవర్నర్ అజయ్కుమార్ భల్లా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ ఈ దాడిని గర్హించారు. ఈ దశలో రాష్ట్రానికి ఇది క్రూరమైన పంజా అన్నారు. మన వీరోచిత జవాన్లు మృతి చెందడం కలిచివేసిందన్నారు. దుండగులకు కఠిన శిక్ష తప్పదన్నారు.