* తెలంగాణకు చారిత్రక అన్యాయం ఇకపై కొనసాగదు
* కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్ 2 ముందు వాదనలు
* తెలంగాణ హక్కులను తప్పకుండా దక్కించుకుంటాం
* మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో కృష్ణా ట్రైబ్యునల్లో తుది వాదనలు
* కృష్ణా-గోదావరి జలాల్లో హక్కుల కోసం రాజీలేని పోరాటం
* అల్మట్టి ఎత్తు పెంపు అంశంపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తాం
* రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయమైన వాటా రావాలని కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్ 2 ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తోందని, మొత్తం 1050 టీఎంసీలలో దాదాపు 70 శాతం అంటే 763 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 23న ఢిల్లీలో మళ్లీ ప్రారంభమైన కృష్ణ ట్రైబ్యునల్ విచారణల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసు చివరి దశకు చేరుకుందని, ఫిబ్రవరి నుండి తెలంగాణ తుది వాదనలు వినిపిస్తున్నదని ఉత్తమ్ చెప్పారు. ఈ విచారణలు సెక్షన్-3 రిఫరెన్స్ కింద జరుగుతున్నాయని, అన్ని పిటిషన్లు పూర్తయ్యాయని గత కొన్ని నెలలుగా సీనియర్ అడ్వకేట్ ఎస్.వైద్యనాథన్ తెలంగాణ తరఫున వాదనలు వినిపిస్తున్నారని, ఆయనకు మూడు రోజుల సమయం కేటాయించబడిందని తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ ముందు స్వయంగా నీటి పారుదల శాఖ మంత్రి హాజరుకావడం బహుశా దేశంలో ఇదే మొదటి సారి అయి ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎంతగానో సీరియస్గా తీసుకుంతుందో అర్థం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. గత కేటాయింపులను వివరించిన ఉత్తమ్ కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1005టీఎంసీలు కేటాయించిందని గుర్తు చేశారు. వీటిలో 811 టీఎంసీలు 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా, 49 టీఎంసీలు 65శాతం డిపెండబిలిటీ ఆధారంగా, 145 టీఎంసీలు సగటు ప్రవాహాల ఆధారంగా కేటాయించబడ్డాయని వివరించారు. అదనంగా గోదావరి డైవర్షన్ ద్వారా 45 టీఎంసీలు ఇచ్చారని, మొత్తంగా 1050 టీఎంసీలు కేటాయించబడ్డాయని అన్నారు. సగటు ప్రవాహాల కంటే ఎక్కువగా వచ్చే నీటిని వినియోగించుకోవచ్చని కూడా స్వేచ్ఛ ఇచ్చారని, 2014 లో తెలంగాణ వేరుగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్తగా బేసిన్ పారామీటర్ల ఆధారంగా వాటాను కోరుతోందని ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ డిమాండ్ శాస్త్రీయమైనదని, అంతర్జాతీయంగా అంగీకరించబడిన పారామీటర్ల మీద ఆధారపడి ఉందని పేర్కొన్నారు. క్యాచ్మెంట్ ఏరియా, బేసిన్లోని జనాభా, కరవు ప్రాంతం విస్తీర్ణం, సాగు భూములు వంటి అంశాల ఆధారంగా లెక్కలు వేసి 75శాతం డిపెండబుల్ వాటర్లో 555 టీఎంసీలు, 65 శాతం డిపెండబుల్ వాటర్లో 43 టీఎంసీలు, సగటు ప్రవాహాల నుండి 120 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ నుండి మొత్తం 45 టీఎంసీలు తెలంగాణకు రావాలని కోరుతున్నారు. మొత్తంగా ఇది 763 టీఎంసీలుగా అవుతుంది. సగటు ప్రవాహాలపై మిగిలిన అదనపు నీటిని వినియోగించే స్వేచ్ఛ కూడా తెలంగాణదేనని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఇలాంటివి ఆపాలి : ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించబడిన 811 టీఎంసీల్లో పెద్ద భాగాన్ని బేసిన్ వెలుపలికి మళ్లించిందని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఇలాంటివి ఆపాలని, బదులుగా ప్రత్యామ్నాయ వనరులను వినియోగించాలని ట్రైబ్యునల్ ముందు తెలంగాణ విన్నవించుకుందన్నారు. అలా మిగిలిన నీటిని ప్రాంతాల్లో వాడుకోవాలని కోరారు. సగటు ప్రవాహాలపై మిగిలిన మొత్తం నీటిని వినియోగించే హక్కు తెలంగాణకే ఉందని, దీన్ని ట్రైబ్యునల్ ముందు బలంగా వాదిస్తామని అన్నారు. ఇది కేవలం ఒక డిమాండ్ మాత్రమే కాకుండా, దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేసే చర్య అని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలను తెలంగాణకే కేటాయిస్తూ, 512 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ఒప్పందానికి అంగీకరించడం రైతులకూ, కరవు ప్రాంతాలకూ మోసం చేశారని ఉత్తమ్ అన్నారు. దాదాపు పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని అంగీకరించిందని, అందుకే ఇప్పుడు ఆ ఫైలును మళ్లీ తెరిచి మొదటి నుంచి వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు. 299 టీఎంసీలు అంగీకరించిన గత ఒప్పందం, తాము కోరుతున్న 763 టీఎంసీల మధ్య వ్యత్యాసమే ఈ అన్యాయానికి నిదర్శనమని అన్నారు. జలశక్తి మంత్రిత్వశాఖలో కూడా ఆ ఒప్పందం నమోదైనప్పటికీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా తిరస్కరించిందని చెప్పారు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజీపడం : పొరుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ రాజీపడబోదని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో టిడిపి ఉన్నా, మహారాష్ట్రలో బిజెపి ఉన్నా, తెలంగాణ తన హక్కుల కోసం కఠినంగా పోరాడుతుంది. ఒక్క చుక్క నీళ్లను కూడా వదులుకోదు, అని ధీమా వ్యక్తం చేశారు. అల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచే కర్ణాటక యోచనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటి నిర్ణయం తెలంగాణకు నేరుగా నష్టం చేస్తుందని హెచ్చరించారు. దీనిని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని అన్నారు. మా ప్రభుత్వ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ వాటా తగ్గించే చర్య ఏదీ అనుమతించమని చెప్పారు. అల్మట్టి ఎత్తు పెంపు అనుమతించకుండా సుప్రీంకోర్టులో పోరాడతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కేసుపై సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తి స్థాయి వాదనలు వినిపించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఉత్తమ్ తెలిపారు.
ఇది కేవలం న్యాయ పోరాటం మాత్రమే కాదని రైతుల జీవనాధారానికి, కరవు ప్రాంతాల భవిష్యత్తుకు సంబంధించినదన్నారు. ట్రైబ్యునల్ న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని విచారణలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మేము మా వాదనలను అన్ని ఆధారాలతో సమర్పించామని వివరించారు. ఈ సారి తెలంగాణకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఉత్తమ్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గదని ప్రజలకు హామీ ఇచ్చారు. డిపెండబుల్ ఫ్లోస్ అయినా, సగటు ప్రవాహాలైనా, అదనపు నీరైనా, గోదావరి డైవర్షన్లు అయినా -తెలంగాణల తన హక్కు కోసం పోరాడుతుందని పునరుద్ఘాటించారు. చారిత్రక అన్యాయం ఇకపై కొనసాగదని, తెలంగాణ తన హక్కు దక్కించుకుంటుందని ఉత్తమ్ స్పష్టం చేశారు.
Also Read: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం