Sunday, May 5, 2024

అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు ఆస్పత్రి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/కోరుట్ల/జనగామ ప్రతినిధి/ఉప్పల్: తెలంగాణలో కాంగ్రెస్, మజ్లిస్ కుటుంబ పార్టీలేనని జనరేషన్లు మారినా ఇవి కుటుంబ పార్టీలుగానే ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఈసారి మూడో దీపావళి జరగబోతుందని, డిసెంబర్ 3వ తేదీన బిజెపి అధికారంలోకి రాగానే రెండోసారి దీపావళి, జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభమయ్యాక మూడోసారి దీపావళి జరుపుకోబోతున్నారన్నారు. సోమవారం జనగామ, కోరుట్లలో నియోజకవర్గాల్లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ ఎంఐఎం 3జీ, కాంగ్రెస్ 4జీ పార్టీలు అయితే బిజెపి తెలంగాణ ప్రజల పార్టీ అని, అధికారంలోకి రాగానే అవినీతి పరులందరినీ జైలుకు పంపించే బాధ్యత బిజెపి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే మూడు షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభించడంతో పాటు నిజామాబాద్‌లో 500 పడకలతో బీడీ కార్మికుల కోసం ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బైరాన్‌పల్లిలో అమరవీరుల స్మారక స్థూపం నిర్మించడంతో పాటు సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామన్నా రు. కాంగ్రెస్ బిసిలను మోసం చేసిందని తెలంగాణలో తొలిసారి బిసి ముఖ్యమంత్రిని తమ పార్టీ చేయబోతున్నదన్నారు. ఎస్‌సి వర్గీకరణకు బిజెపి కట్టుబడి ఉందని, ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లను తొలగించి వాటిని బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయిస్తామన్నారు. పసుపు బోర్డును ప్రకటించడంతో ఉత్తర తెలంగాణ రైతుల ఆకాంక్షను మోడీ నెరవేర్చారన్నారు. వరి ధాన్యాన్ని రూ.3100 మద్దతు ధరతో పూర్తిగా కొనుగోలు చేస్తామని, మహిళలకు ఏడాదికి ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు, రూ.10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీ, వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య కాశీ యాత్రల సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో బిజెపిని గెలిపించాలని అలాగే 2024లో మోడీని మూడోసారి ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News