Sunday, April 28, 2024

ఉపాధి నిధుల్లో కోత వద్దు

- Advertisement -
- Advertisement -

కేంద్రం కక్షసాధింపు మానుకొని ఉపాధిహామీలో సరిపడా పని దినాలు కల్పించాలి

రాష్ట్ర ట్రాక్ రికార్డు ప్రకారం కనీసం
18కోట్ల పని దినాలను
ఆమోదించాలి బకాయి పడిన
రూ.97కోట్ల 35లను వెంటనే
చెల్లించాలి గతంలో మాదిరిగా
ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేక చెల్లింపులు
ఉండాలి ఉపాధి హామీని
వ్యవసాయంతో అనుసంధానం
చేయాలన్న డిమాండ్‌ను కేంద్రం
పట్టించుకోవడం లేదు లేబర్
బిల్లులు రాష్ట్రానికి సంబంధం లేకుండా
నేరుగా పంపించడం అన్యాయం
పంచాయతీలకు ఇచ్చే 15వ ఆర్థిక
సంఘం నిధుల్లో కేంద్రం భారీ కోత
విధించింది

నిధులు రాలేదని కొన్నిచోట్ల
సర్పంచులు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు.. ఓపిక పట్టాలి
ప్రజోపయోగ పనులు చేస్తున్న
రాష్ట్రాన్ని ప్రోత్సహించాలి
ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్
సమావేశంలో తీర్మానం

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కక్ష్య సాధింపు చర్యలను మానుకోవాలని ఉపాది హామీ రాష్ట్ర కౌన్సిల్ సూచించింది. ఉపాధి హామీ నిధులలో ఎలాంటి కోతలు విధించకుండా… గత ట్రాక్ రికార్డు ఆధారంగా ప్రస్తుతం జరుగుతున్న పనులను చూసి రాష్ట్రానికి కనీసం 16 కోట్ల పనిదినాలను ఆమోదించాలని డిమాండ్ చేసింది. అలాగే ప్రజోపయోగ పనులు చేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాలని ఉపాధి హామీ కౌన్సిల్ తీర్మానించింది. అలాగే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని మరోసారి విజ్ఞప్తి చేసింది. అర్భన్ ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ చేసుకునే వీలు కల్పించాలని కోరింది. హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ హాలులో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఇజిఎస్ స్టేట్ డైరెక్టర్లు అందె యాకయ్య, సద్గుణ రవిందర్, వెంకటనారాయణ గౌడ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిష్టినా జడ్ చోంగ్తు, కమిషనర్ శరత్, ఇజిఎస్ స్పెషల్ కమిషనర్ ప్రసాద్, ఇఎన్‌సి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇప్పటికే బకాయి పడిన 97 కోట్ల 35లక్షల రూపాయలను వెంటనే చెల్లింలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేకంగా పేమెంట్స్ ఇవ్వాలన్నారు. పని జరిగే ప్రాంతాల్లో ఫోటోలు తీయడం, పంపడం వంటి ఇబ్బందికర చర్యలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ నిధుల వినియోగంలో దేశంలో తెలంగాణ రాష్ట్రమే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.. అత్యధికంగా కూలీలకు పని దినాలు కల్పిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణే అని వారు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అడిగిన వారందరికి కొత్త జాబ్ కార్డులు ఇస్తున్నామన్నారు. కూలీలు కూడా ఉపాధి కోసం డిమాండ్ చేస్తున్నారన్నారు.

కరోనా కష్ట కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పల్లె ప్రగతి కార్యక్రమాల వల్ల ప్రజలు పట్టణాల నుంచి పల్లెలకు వాపస్ వలస పోతున్నారని మంత్రులు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కాలంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయవద్దు అనే క్లారిటి ఉండేది కాదన్నారు. తెలంగాణకు ముందు అవసరం లేని పనులు, ఉపయోగంలో లేని వాటికి ఉపాధిహామీ పనులు చేసిన సందర్భాలు ఉండేవన్నారు. కానీ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రజలకు అవసరమయ్యే పనులకు ఉపాధిహామీ నిధులను, కూలీలను ఉపయోగిస్తున్నామన్నారు. నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు కళ్లాలు, సిసి రోడ్లు, సీసీ డ్రైనేజీలు వంటి పనులకు ఉపాధిహామీని ఉపయోగిస్తున్నామని మంత్రులు చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో 11 కోట్లకు మించి పనిదినాలు ఉండేవి కావు

ఉమ్మడి రాష్ట్రంలో 11 కోట్లకు మించి పనిదినాలుఉండేవి కావని మంత్రులు తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి సంవత్సరంలోనే 10 కోట్ల 39 లక్షల పనిదినాలు కల్పించామన్నారు. అలాగే గత సంవత్సరం (2021-..2022)లో 15 కోట్ల పనిదినాలు కల్పించామన్నారు. ఇందుకుగానూ 4 వేల 395 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరపు బడ్జెట్ లో ఉపాధిహామీకి రూ. 25 వేల కోత పెట్టిందన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనీ ఎన్నిసార్లు అడిగినా కేంద్రం పట్టించుకోలేదని మంత్రులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ బిల్లులు కూడా రాష్ట్రానికి సంబంధం లేకుండా డైరెక్ట్ గా కూలీల అకౌంట్ లలోకి పంపించడం అన్యాయమన్నారు. గతంలో ఎస్‌సి, ఎస్టి కేటగిరీల వారిగా పేమెంట్ ఇచ్చేవారన్నారు.

ఇప్పుడు ఆ కేటగిరీలు కూడా తొలగించం సిగ్గుచేటని విమర్శించారు. పని జరిగే ప్రదేశాల ఫోటోలు పెట్టాలని కొత్త రూల్ కేంద్ర ప్రభుత్వం పెడుతోంది. ఇది సాధ్యం కూడా కాదని మంత్రులు అభిప్రాయపడ్డారు. మరోవైపు బకాయిలు కూడా చెల్లించకపోగా, రాష్ట్రాన్ని బద్నామ్ చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా 97 కోట్ల 35 లక్షల లేబర్ పేమెంట్ కూడా పెండింగ్ లో ఉందన్నారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా 18 వందల 30 కోట్ల నుండి 13 వందల 80 కోట్లకు తగ్గించారన్నారు. ఇందులో దాదాపు 500 కోట్ల కోత విధించారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో గ్రామ పంచాయతీలకు అందాల్సిన డబ్బులు ఆలస్యమవుతున్నాయని మంత్రులు పేర్కొన్నారు.

సర్పంచ్ లు ఓపిక పట్టాలి

కొన్ని చోట్ల సర్పంచ్ లు తమకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదని అంటున్నారని…. రోడ్ల మీదకు వస్తున్నారు. మీడియాకెక్కుతున్నారని మంత్రి ఎర్రబెల్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆ నిధులు ఇచ్చేది కేంద్రమేనని అన్నారు. అది మన రాష్ట్రాల హక్కు అని అన్నారు. అందుకు సరిసమానంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ నిధులు పంచాయతీలకు ఇస్తున్నారన్నారు. అయితే, కేంద్రం నుండి నిధులు రాకపోవడం వల్ల మాత్రమే కొన్ని పంచాయతీల్లో నిధుల సమస్య తలెత్తిందన్నారు. ఆ సమస్య పరిష్కారానికి మంత్రులుగా తాము, అధికారులు కూడా కృషి చేస్తున్నారు. త్వరలోనే కేంద్రం పెండింగ్ బిల్లులను తెప్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సర్పంచ్ లు సంయమనం పాటించాలని, ఆందోళన చెంద వద్దని ఆయన అన్నారు.

సదాశివనగర్ లో పెండింగ్ బిల్లులు రూ. 86వేలే!

కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ లో 3 లక్షల 50 వేలు పెండింగ్ లో ఉన్నాయని ఒక మీడియాలో వచ్చిన వార్తను మంత్రి ఎర్రబెల్లి ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. కేవలం రూ. 86 వేలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. అది కూడా 29 ఏప్రిల్ లో జనరేట్ చేసినవన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News