Sunday, May 5, 2024

అఫ్ఘన్‌లో ప్రళయ విలయమే..

- Advertisement -
- Advertisement -

కాబూల్ : కరడుగట్టిన ఆంక్షల అత్యధిక సంఖ్యాక నిరుపేదల దేశం అఫ్ఘనిస్థాన్‌ను పెను భూకంపం కకావికలం చేసింది. కనీసం 2000 మంది భూకంప తాకిడితో మృతి చెందారు. ఇప్పటికీ లెక్కలేనంత మంది క్షతగాత్రులై అందని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పశ్చిమ అఫ్ఘనిస్థాన్‌లోని హెరాత్ భూకంప ప్రధాన కేంద్రంగా మారింది. శనివారం తలెత్తిన తీవ్రస్థాయి భూకంపం, తరువాతి అంతే సామర్థపు శక్తివంతపు అనంతర ప్రకంపనలతోఇప్పుడు అఫ్ఘన్ హృదయవిదారక ఛిద్ర చిత్రితం, రక్తసిక్తం అయింది. ఇప్పటివరకూ మృతుల సంఖ్య తమకు అందిన సమాచారం మేరకు రెండువేల వరకూ ఉంటుందని ఒక్కరోజు తరువాత ఆదివారం తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒక్కరు చెప్పారు. అంతంత స్థాయిలోనే ఉండే సమాచార వినిమయ వ్యవస్థతతో మారుమూల ప్రాంతాలలో భూకంప విధ్వంసం ఏ మేరకు ప్రాణ, ఆస్తినష్టం కల్గించిందనేది అంతుచిక్కకుండా ఉంది. రెండు దశాబ్దాల కాలంలో ఇప్పుడు సంభవించిన భూకంపం అత్యంత భయానకం, తీవ్రస్థాయిదని అధికారులు తెలిపారు.

ఆదివారం వెలువరించిన ప్రకటన మేరకు మొత్తం మీద మృతుల సంఖ్య 2060. కాగా గాయపడ్డ వారిసంఖ్య 1240, నేలమట్టం అయిన నివాసాలు 1320 . గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఏ స్థాయికి చేరుతుందో అనే ఆందోళన వ్యక్తం అయింది. ఈ ప్రాంతంలోని హెరాన్ సిటీకి వాయవ్యంగా కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే భూకంప ప్రధాన కేంద్రం ఉందని అమెరికాకు చెందిన భూకంపాల పరిశోధనా సంస్థ (యుఎస్‌జిఎస్) తెలిపింది. రెక్టర్ స్కేలుపై తొలుత 6.3 తీవ్రతతో మొదటి రెండు భూకంపాలు సంభవించాయి. తరువాత వరుసగా మూడు తీవ్రస్థాయి భూ ప్రకంపనలు 6.3, 5.9, 5.5 తీవ్రతతో ఆటుపోట్లను సృష్టించాయి. ఇదే క్రమంలో పలు మార్లు స్వల్ప ప్రకంపనలు కూడా రావడంతో జనం ఎటు కదలలేని దిక్కుతోచని స్థితిలో గంటల తరబడి కొట్టుమిట్టాల్సి వచ్చింది.

బతికి ఉన్న వారికి అనుక్షణ నరకం
భూకంపంలో వేలాది మంది చనిపోగా, మిగిలిన వారు ఇక్కడి దారుణ పరిస్థితుల నడుమ, ఎంతకూ అందని సాయం మధ్య నరకం చవిచూస్తున్నారు. కుప్పకూలిన రాళ్ల, మట్టి ఇటుకల ఇళ్ల శిథిలాల మధ్య చిక్కుపడి ఉన్న తమ వారి మృతదేహాలను బతికి ఉన్న బంధువులు అతికష్టం మీద వెలికి తీస్తున్నారు. పలు చోట్ల శవాల ముఖాలపై మట్టి అంటుకుని పోయింది. గాయపడి నడవలేని స్థితిలో ఉన్న తమ వారిని జనం తీసుకువెళ్లుతున్నారు.

శిథిలాల మధ్య మెడవరకూ కూరుకుపోయిన చిన్నారి
భూకంపంలో ఓ చోట కుప్పకూలిన ఇంటి శిథిలాల కింద మెడవరకూ రాళ్లు రప్పలు , మట్టిలో కూరుకుపోయి ఉన్న ఓ చిన్నారి బాలికను వెలికితీసేందుకు స్థానికులు యత్నిస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఈ బాలిక పై ఓ చేయి చుట్టుకుని ఉంది. ఇది బహుశా ఈ పాప తల్లి చేయి అయ్యి ఉంటుంది. శిథిలాలు తన బిడ్డపై పడకుండా ఈ తల్లి ప్రయత్నించి ఉంటుందని వెల్లడైంది. అయితే ఇప్పటికీ ఈ తల్లి బతికి ఉందా? లేదా అనేది తెలియడం లేదు. ఇప్పుడు అందించిన సమాచారం సరైనది కాదని, మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని దేశ సమాచార , సాంస్కృతిక వ్యవహారాల ప్రతినిధి అబ్దుల్ వహీద్ రయాన్ తెలిపారు. పూర్తిగా నేలమట్టం అయిన ఇండ్ల కింత ఎంత మంది చిక్కుపడ్డారనేది తేలడానికి అనేక రోజులు పడుతుందని అధికార ప్రతినిధి తేల్చిచెప్పారు.

ఇప్పటికీ భూకంప తాకిడి ప్రాంతాలలో డజన్ వరకూ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలను చేపట్టాయి. సైన్యం, రెడ్ క్రిసెంట్ వంటి స్వచ్ఛంద సంస్థలు ప్రజలను ఆదుకునేందుకు యత్నిస్తున్నాయి. ఐరాసకు చెందిన మైగ్రేషన్ సంస్థ అంబులెన్స్‌లు, వైద్య బృందాలను తరలించింది. ప్రాంతీయ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారికి మానసిక స్థయిర్యం కల్పించేందుకు సైకోసోషల్ కార్యకర్తలు కూడా వచ్చారు. పూర్తిగా దెబ్బతిన జెండా జన్ జిల్లాకు కనీసం మూడు సంచార ఆరోగ్య బృందాలు తరలివచ్చాయి. హెరాత్‌లో ఇప్పుడు పలు దేశాలకు చెందిన డాక్టర్లతో కూడిన బృందాలు కొన్ని తాత్కాలిక వైద్య కేంద్రాల శిబిరాలను ఏర్పాటు చేసి సేవలను అందిస్తున్నాయి.

పరిస్థితిని తెలుసుకుంటున్న పాకిస్థాన్
అఫ్ఘన్ సరిహద్దుల్లోని పాకిస్థాన్ ఇప్పటి విలయంపై తీవ్రవిచారం వ్యక్తం చేసింది. ఎప్పటికప్పుడు తాము అఫ్ఘన్ అధికార యంత్రాంగంతో సంప్రదిస్తూ పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు పాకిస్థాన్ అధికారి ఒక్కరు ఆదివారం తెలిపారు. ఇప్పుడు అవసరమైన సరుకుల గురించి సాయం గురించి విశ్లేషించుకుని తమవంతుగా ఆఫ్ఘన్‌కు సాయం అందిస్తామని పాకిస్థాన్ తెలిపింది. అక్కడి సహాయ కార్యక్రమాలకు తాము చేయూత అందిస్తామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వివరించారు. అఫ్ఘన్‌కు పూర్తి సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాబూల్‌లోని చైనా రాయబారి జావో జింగ్ తెలిపారు. హెరాత్ బాధితులకు తాను తనకు క్రికెట్ వరల్డ్ కప్ ద్వారా అందిన మొత్తాన్ని సాయంగా అందిస్తున్నట్లు అఫ్ఘన్ క్రికెట్ స్టార్ రషీద్ ఖాన్ ప్రకటించారు. త్వరలోనే నిధుల సేకరణను చేపడుతామని ఎక్స్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు. ఈ భూ విలయంపై జపాన్ అంబాసిడర్ తకాషీ ఒకాడా సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News