Sunday, April 28, 2024

పాదయాత్రకు పర్మిషన్ లేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్రకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. హత్ సే హత్ జోడోలో బ్లాకుల వారీగా పాదయాత్ర నిర్వహిస్తామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అభియాన్ ముగింపులో భాగంగా హైదరాబాద్‌లో జరిగే సభకు రాహుల్ గాంధీ వస్తారని ఆయన తెలిపారు. ఎఐసిసి ఇచ్చిన సర్క్యూలర్‌లో 2 నెలల పాదయాత్ర అని వుందని, జనవరి 26 నుంచి 5 నెలల పాటు పాదయాత్ర కొనసాగనుందని పేర్కొన్నారు. అంతేకానీ రేవంత్ పాదయాత్రకు ఎఐసిసి అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు.

కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ‘యాత్ర’ పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం ఆయన విడుదల చేశారు. జనవరి 26 నుంచి జూన్ 2 వరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. “హాత్ సే హాత్ జోడ్ అభియాన్‌” పేరుతో ఆయన ‘యాత్ర’ నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వేడి చల్లారకుండా ఆ యాత్రకు కొనసాగింపుగా కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అన్ని నియోజక వర్గాల్లో ఇంఛార్జీలు ఈ యాత్ర చేపట్టాలని ఎఐసిసి ఇప్పటికే ఆదేశించింది.

ఈ క్రమంలో మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించు కున్నాయి. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఇప్పటికే పేరు, ముహూర్తం ఖరారు అయిన సంగతి తెలిసిందే. హాత్ సే హాత్ జోడో యాత్రగా దీనికి నామకరణం చేయగా జనవరి 26 నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. పిసిసి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం తెలం గాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన భద్రాచలం నుండి ప్రారంభించి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభతో ముగించాలని చూస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలతో పాదయాత్రపై సందిగ్ధం నెలకొంది. కానీ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలతో అసలు రేవంత్ పాదయాత్ర ఉంటుందా? లేదా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ రేవంత్ పాదయాత్ర ఉంటే దానికి సీనియర్లు ఏ మేరకు సహకరిస్తారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. మరికొన్ని రోజుల్లో రేవంత్ పాదయాత్రపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్ హైకమాండ్‌కు డిగ్గీరాజా నివేదిక అందజేత
ఇటీవలే ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి అసమ్మతి నేతలతో మాట్లాడారు. పిసిసి చీఫ్ వర్గం నాయకులతో పాటు సీనియర్లతో వరుస భేటీలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే పార్టీలోనే చర్చించుకోవాలని, బహిరంగ విమర్శలు, కామెంట్స్ చేయొద్దన్నారు. అయితే రాష్ట్రంలో డిగ్గీ టూర్ తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. డిసెంబర్ లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు కూడా సీనియర్లెవరూ హాజరు కాలేదు.

దిగ్విజయ్ సింగ్ ఓ నివేదికను పార్టీ హైకమాండ్ కు ఇచ్చారని చెబుతున్నారు. ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటారని సీనియర్లు కూడా ఎదురు చూస్తున్నారు. పిసిసి అధ్యక్షుడ్ని లేదా రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్‌ను తొలగించాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని కూడా అంటున్నారు. అందరూ కలిసి పాదయాత్ర చేయాలని, ఒక్క రేవంత్ మాత్రమే చేయకూడదని వారి వాదన. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రను ఇప్పటికే ప్రకటించారు.

కాంగ్రెస్ సీనియర్లకు ఖర్గే ఫోన్…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్న సీనియర్లు నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. బుధ వారం బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు జరగనున్నాయి. వీటికి హాజరుకావాలని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసమ్మతి నేతలకు ఫోన్ చేశారు. దీంతో సీనియర్ నేతలు మీటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడే నేరుగా ఫోన్ చేసి అడిగినందున వెళ్లకపోతే బాగుండదన్న అభిప్రాయంతో వారు ఉన్నారు. వారం రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు ఫోన్‌లో హామీ ఇచ్చినట్లుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News