ఔరంగాబాద్ ఎంఐఎం ఎంపి జలీల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: తమ పార్టీని బిజెపికి చెందిన బి-టీమ్గా ఆరోపించే వారికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టని ఔఎఎంఐఎం ఔరంగాబాద్ ఎంపి ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాలు గెలుచుకుని తమ పార్టీ తన సత్తా చాటుకుందని ఆయన అన్నారు. బీహార్ అసెంబ్లీ మూడవ దశ పోలింగ్కు ముందు ఎఐఎంఐఎం పార్టీని బిజెపి బి-టీమ్గా అభివర్ణిస్తూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. బిజెపితో ఎంఐఎం కుమ్మక్కయిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఐదు స్థానాలలో ఎంఐఎం విజయం సాధించిన సందర్భంగా మంగళవారం రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఎంపీ జలీల్ నాయకత్వంలో పారీ కార్యకర్తలు ఒక విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జలీల్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీపైన, తమ పార్టీపైన విశ్వాసం ఉంచినందుకు బీహార్లోని సీమాంచల్ ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఓట్లను చీల్చడానికే తాము పోటీచేస్తామని ఆరోపిస్తున్న వారికి బీహార్ అసెంబ్లీ ఫలితాలు చెంపపెట్టని జలీల్ అన్నారు. బీహార్ ఫలితాలు కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.