ముంబై: హెల్మెట్ను వాడే విషయంలో ఏ క్రికెటర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించ కూడదని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సూచించాడు. ఇటీవల కాలంలో కొంత మంది ఆటగాళ్లు హెల్మెట్ను వాడకుండా బ్యాటింగ్ చేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది క్రికెటర్లకు ఎంతో నష్టం కలిగించే ప్రమాదం ఉందన్నాడు. ఈ అంశంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి కఠిన నిబంధనలు తేవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు. క్రికెట్లో బ్యాట్స్మన్ హెల్మెట్ వాడాలనే నిబంధనను తప్పనిసరి చేయాల్సిందేనని సూచించాడు. గతంతో పోల్చితే ప్రస్తుతం బౌలర్లు మరింత వేగంగా బంతులు విసురుతున్నారని, ఇలాంటి స్థితిలో హెల్మెట్ ధరించి బ్యాటింగ్ చేయడమే మంచిదన్నాడు. ఐపిఎల్లో చాలా మంది క్రికెటర్లు హెల్మెట్ ధరించ కుండానే బ్యాటింగ్ను చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకున్న విషయాన్ని సచిన్ గుర్తు చేశాడు.