Sunday, April 28, 2024

అక్షయ్‌కు పాన్‌మసాలా ఘాటు

- Advertisement -
- Advertisement -

Akshay Kumar apologises to fans after pan masala brand backlash

విమల్ యాడ్ జోలికెళ్లనని ప్రకటన

ముంబై : హిట్‌హీరో అక్షయ్‌కుమార్‌కు పాన్‌మసాలా ఘాటు బలంగా తగిలింది. విమల్ ఇలాయిచీ మసాలా అమ్మకాల ప్రకటన ఈ బిజీ హీరోపై అభిమానుల తిట్లు పడేలా చేసింది. ఇంత పెద్ద స్టార్‌వయి ఈ పాన్‌మసాలా బ్రాండ్ అమ్మకాలకు ప్రచారం చేస్తావా? అంటూ ప్రజలు విమర్శించారు. దీనితో తాను తక్షణం ఈ పాన్‌మసాలా యాడ్ నుంచి విరమించుకుంటున్నట్లు, అభిమానులకు కల్గిన మనస్థాపానికి చింతిస్తున్నానని వారి క్షమాపణలు కోరుతున్నానని అక్షయ్ గురువారం ఓ ప్రకటన వెలువరించారు. తోటి హీరో అజయ్ దేవగన్‌తో కలిసి అక్షయ్ పాన్‌మసాలా యాడ్‌లో తరచూ కనపడుతూ ఉంటారు. చిత్రాలలో తీరిక లేకుండా ఉన్నందున అనుకోకుండానే ఈ యాడ్ కాంట్రాక్టు తీసుకున్నానని అయితే తరువాత ఇది సామాజిక బాధ్యతను విస్మరించే పెద్ద తప్పు అని తెలుసుకుని చెంపలేసుకుంటున్నానని అక్షయ్ కుమార్ తమ విచారం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ నుంచి ఇతర వర్గాల నుంచి వచ్చిపడ్డ ట్వీట్లు తిట్టు తనను కదిలించి వేశాయని వీరి చురుకైన అభిప్రాయాలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని అక్షయ్ తెలిపారు.

జరిగిన దానితో ఇకపై అత్యంత జాగ్రత్తగా ఉంటాను. యాడ్స్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్న తరువాతనే కాంట్రాక్టు తీసుకుంటానని వివరణ ఇచ్చుకున్నారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులకు సారీ చెపుతున్నానని , తాను ఎట్టి పరిస్దితుల్లోనూ ప్రాణాంతక పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించేది లేదన్నారు. ఇప్పటివరకూ ఈ పాన్‌మసాలా యాడ్ ద్వారా వచ్చిన పారితోషికం మొత్తం లెక్కకట్టి ఓ మంచిపనికి చందాగా ఇస్తానని తెలిపారు. అయితే ఇంతకు ముందటి యాడ్ కాంట్రాక్టు పరిమితి ఇంకా ఉండటం వల్ల గడువు తీరే వరకూ ఆ యాడ్ వస్తూనే ఉంటుందని, దీనిని తానేమీ చేయలేనని, చట్టబద్ధమైన ప్రక్రియకు లోబడి ఉండాల్సి వస్తుందని, దీనిని తన అభిమానులు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News