Monday, May 6, 2024

కేటాయింపులు పెంచాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సమగ్ర ప్రగతి, అభివృద్ధి అంశాలు, విధాన కార్యక్రమాలు, సహకారంపై నీతిఆయోగ్‌తో బృందంతో రాష్ట్ర ప్రభు త్వం చర్చలు జరిపింది. డా.బిఆర్.అంబేడ్కర్ సచివాలయంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కుమార్ బేరి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం సమావేశమయ్యింది. ఈ సందర్భంగా పలు అంశాలకు సం బంధించి వారివురు చర్చించారు. సహకార సమైక్యవాదం, అభివృద్ధి ప్రాధాన్యతలు, వనరుల కేటాయింపుల గురించి నీతి ఆయోగ్ బృందం ముఖ్యమంత్రిల మధ్య చర్చకు వచ్చాయి. సమర్థవంతమైన పాలనకు మార్గదర్శక సూ త్రంగా కో-ఆపరేటివ్ ఫెడరలిజం ప్రాముఖ్యతను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నీతి ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించడానికి కలిసి పనిచేయడానికి ఇరువురు అంగీకరించారు.రాష్ట్రాభివృద్ధి, కీలక రంగాలకు సంబంధించి ప్రాధాన్యతలను, రాష్ట్ర అవసరాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నీతి ఆయోగ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తమవంతుగా సహకారమందిస్తామని నీతి అయోగ్ ప్రతినిధి బృందం హామీ ఇచ్చింది.

కేంద్రం నుంచి అందాల్సిన న్యాయమైన కేటాయింపులు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికిచ్చే నిధులు, వనరుల మం జూరు గురించి చర్చించారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి ఇచ్చే నిధుల కేటాయింపు పెరిగేలా చూడాలని, ఆరోగ్యం, విద్యలో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని సిఎం విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 94(2) ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.1800 కోట్ల నిధుల విడుదల గురించి చర్చించారు. వినూత్న పాలనా పద్ధతులు, వి జయవంతమైన నమూనాలను పరస్పరం సహకరించుకోవాలని ఇరువురు అంగీకరించారు. స్థానిక సమస్యలు పరిష్కరించడంలో మెరుగైన పద్ధతులను అవలంభించాలని సిఎం నీతి ఆయోగ్‌కు సూచించారు. అదేవిధంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న యువతలో నైపుణ్యాలను పెంపొందించాలని కోరారు. సోలార్ ఎనర్జీని వినియోగించుకోవడంపై సమావేశంలో చర్చించి రాష్ట్రానికి సహకరించాలని ప్రభుత్వం కోరింది. చర్చల్లో భాగంగా రాష్ట్ర సామర్ధ్యాలను పటిష్టం చేయడానికి స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (ఎస్‌ఐటి)ను రాష్ట్రంలో ఏర్పాటుపై దృష్టి సారించారు.అంతర్జాతీయ అత్యుత్తమ స్థాయిలో పిపిపి మోడల్ ద్వారా సబర్మతి రివర్ ఫ్రంట్, నమామి గంగే వంటి ప్రాజెక్టుల మాదిరిగానే మూసీ రివర్ ఫ్రంట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి కోసం సాంకేతిక సహకారం అందించాలని ప్రభుత్వం కోరింది. మురుగునీటి శుద్ధి ప్లాంట్స్ (ఎస్‌టిపి) ఏర్పాటు కోసం సహకరించాలని సిఎం విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కోరారు. పాలక మండలిలో రాష్ట్ర భాగస్వామ్యం కావాలని నీతి ఆయోగ్ కోరింది. నిర్మాణాత్మక మద్దతు, సహకారం నీతి ఆయోగ్‌కు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టిలు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నీతిఆయోగ్ నుంచి వైస్ చైర్మన్ సుమన్ కుమార్, మెంబెర్ విజయ కుమార్, డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్, డైరెక్టర్ అభినేష్ డాష్, ముత్తు కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News