Saturday, April 27, 2024

ఇంటర్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: సిఎస్ శాంతికుమారి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హెచ్చరించారు. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్‌పిలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిపి రవి గుప్తా, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, ఎస్‌ఏ.ఎం.రిజ్వి, నదీమ్ అహ్మద్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం ఆడే ఏవిధమైన చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షా పేపర్ లీకేజీకి ప్రయత్నించిన పలువురు అధ్యాపకులు, సిబ్బందిని గుర్తించి వారిని అరెస్టు చేయడమే కాకుండా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇంటర్ పరీక్షలలో మొదటి, రెండవ సంవత్సరాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1521 పరీక్ష కేంద్రాలలో సుమారు 9,80,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు.

ఈ పరీక్షా కేంద్రాలలోనికి ఉన్నతాధికారులతో సహా ఏ ఉద్యోగి కూడా సెల్ ఫోన్ లను తీసుకెళ్లడం నిషేదించినట్టు స్పష్టం చేశారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల పరీక్షలను సజావుగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రతి రోజు పరీక్షల పూర్తి అయిన అనంతరం జిల్లాలోని సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని, పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షల అనంతరం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని, ఈ పరీక్షల నిర్వహణకు కూడా ఇదే నియమనిబంధనలు పాటించాలని తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News