Tuesday, September 23, 2025

ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెరిగితే దక్షిణ తెలంగాణ ఎడారే:ఎన్.రాంచందర్ రావు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచాలనుకోవడం దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం భూ సేకరణ చేపట్టడం, భవిష్యత్తులో డ్యామ్ ఎత్తును పెంచే ప్రయత్నాలు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. కర్ణాటకలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పటికీ కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను రక్షించడానికి, రైతులకు అన్యాయం జరకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చొరవ చూపడం లేదని ఆయన ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపును ఆపకపోతే, దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జూరాల, నాగార్జునసాగర్, పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. హైడల్ పవర్ కోసం, రైతులకు సాగు నీరు కోసం కృష్ణానదిపై ఆధారపడ్డామని అన్నారు. కృష్ణా నదిపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుతో రైతులకు నష్టం జరుగుతుందనే కారణంతోనే గతంలో సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చిందని వివరించారు.

సుప్రీంకోర్టు స్టే ఉన్నా ఎత్తు పెంచడం అన్యాయం
సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ, ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవ్వడం అన్యాయమని అన్నారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు 519 నుంచి 524 మీటర్లకు పెంచాలని ప్రయత్నించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తెలంగాణకు కృష్ణా జలాల వాటా కేవలం 299 టిఎంసి మాత్రమే సరిపోతుందని కేసీఆర్ సంతకం చేశారని అన్నారు. దీని కారణంగా నదీజలాల వాటాలో తెలంగాణకు నష్టం ఏర్పడిందని తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నీటివాటా విషయంలో తెలంగాణకు నష్టం చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అందుకే బీఆర్‌ఎస్‌కు ఈ విషయంలో మాట్లాడే నైతిక అర్హత కోల్పోయిందని అన్నారు.

ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంపు నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో మాట్లాడి తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు, రైతులకు అన్యాయం జరగకుండా ఎందుకు చొరవ చూపడం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు? అని ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిలదీశారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, పాలమూరుకు నీరు ఆగిపోతే ఎందుకు నోరు మూసుకుంటున్నారు? అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యాసంతా కాంట్రాక్టులు, కమీషన్లపైనే ఉందని అన్నారు. కానీ తెలంగాణలో కృష్ణా జలాల వాటాను రక్షించడంపై లేదని ఆరోపించారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు చర్యలు సుప్రీంకోర్టులో కేసు ఉన్న సందర్భంలో చేయకూడదని సీడబ్ల్యూసీ కూడా చెప్పిందని అన్నారు.

Also REad: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News