Friday, April 26, 2024

అమృత్‌పాల్ తాజా సెల్ఫీ కలకలం

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: గడచిన 10 రోజులుగా పంజాబ్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ తాజా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్‌పాల్ సింగ్ తన గురువుగా భావించే పపల్‌ప్రీత్ సింగ్‌తో కలసి దిగిన సెల్ఫీ సోమవారం సోషల్ మీడియాలో కనిపించడం కలకలం రేపింది. ఎనర్జీ డ్రింక్స్ క్యాన్లను చేతిలో పట్టుకుని వారు సెల్ఫీ తీసుకున్నారు. అమృత్‌పాల్ జాకెట్ ధరించి, తలకు మెరూన్ రంగు టర్కాన్, సన్‌గ్లాసెస్ ధరించి ఉన్నాడు. అమృత్‌పాల్ కు సంబంధించిన ఫోటో ఇంత స్పష్టంగా బయటకు రావడం ఇదే మొదటిసారి. అయితే ఇది తాజా ఫోటోనా కాదా అన్నది పంజాబ్ పోలీసు అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

అరెస్టయిన తమ అనుచరుడిని విడిపించుకోవడానికి అమృత్‌సర్ సమీపంలోని అజ్నాలా పోలీసు స్టేషన్‌పై అమృత్‌పాల్, అతని అనుచరులుదాడి చేసిన తర్వాత ఈ ఖలిస్తానీ సానుభూతిపరుడి కోసం పంజాబ్ పోలీసుల వేట మొదలైంది. ఇప్పటికి మూడు వారాలు దాటినా అమృత్‌పాల్ ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. మార్చి 18న జలంధర్ జిల్లాలో పోలీసుల మాటువేసి ఉండగా వాహనాలను, గెటప్పులను మారుస్తూ అమృత్‌పాల్ తప్పించుకున్నాడు.

ప్రజల మధ్య వైషమ్యాలను వ్యాప్తి చేయడం, హత్యా యత్నం, పోలీసులపై దాడి తదితర అనేక నేరారోపణలు అమృతపాల్‌పైన, అతని అనుచరుల పైన కేసులు నమోదయ్యాయి. కాగా..తాజా ఫోటోలో అమృత్‌పాల్ పక్కనున్న పపల్‌ప్రీత్ సింగ్ కూడా దేశద్రోహంతోపాటు యుఎపిఎ చట్టం కింద మూడు కేసులు ఎదుర్కొంటున్నాడు. అమృత్‌పాల్‌కు మీడియా సలహాదారుగా ఇతను పనిచేస్తున్నాడు. పిజి డిప్లొమా హోల్డర్ అయిన పపల్‌ప్రీత్ సింగ్ 2007 నుంచే ఖలిస్తాన్ సానుభూతిపరుడిగా కొనసాగుతున్నాడు. తన ప్రచారవ్యాప్తి కోసం సోషల్ మీడియాలో ఒక చానల్‌ను కూడా తను నడిపేవాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News