ఎపిలో మరో యువకుడికి శిరోముండనం
ఏడుగురిపై పోలీసుల కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో దళిత యువకుడు శిరోముండనం కేసులో శనివారం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ సిటీ పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఘటన జరిగిన జనసేన నాయకుడు నూతన్ నాయుడు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిలో నూతన్ నాయుడు భార్య మధు ప్రియను ఎ-1గా గుర్తించారు. మధు ప్రియ ఇంట్లో పని చేసే వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై కేసులు నమోదు చేసినట్లు సిపి తెలిపారు. అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు పేర్కొన్నారు. సిసిటివిఫుటేజ్ ద్వారా యువకుడు శ్రీకాంత్పై దాడి జరిగిన తీరును పోలీసులు గుర్తించారు.
ఇందులో నూతన్ నాయుడు భార్య మధు ప్రియ చూస్తుండగా ఇంట్లో సహాయకులు ఇందిర తదితరులు అత్యంత క్రూరంగా శ్రీకాంత్కు శిరోముండనం(గుండు గీయించారు) చేశారు. ఐఫోన్ చోరీ నెపంతో దళిత యువకుడిని పిలిచి శిరోముండనం చేశారని సిపి మనీష్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. శ్రీకాంత్పై దాడి, గుండు చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయని చెప్పారు. శిరోముండనం కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఫోన్ విషయంతో పాటు ఇతర కారణాలపై కూడా లోతుగా విచారణ సాగిస్తామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నూతన్ నాయుడు ప్రమేయం పైన ఆరా తీస్తున్నామని తెలిపారు. బాధితుడిని కర్రలు, రాడ్లతో కొట్టినట్లు వీడియోలో ఉందని మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు.
Another dalit man head tonsured in AP