ఆఫ్రికా నుంచి మరికొన్ని వారాల్లో చేరుకుంటుందని అంచనా
హైదరాబాద్ : దేశంవైపు మరో మిడతల దండు వస్తుందని లోకస్ట్ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. ఇది ఆఫ్రికా నుంచి బయలుదేరిందని, మరో కొన్ని వారాల్లో భారత్కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల గాలి దిశ దేశంవైపు ఉండటంతో ప్రమాదం పొంచి ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ మిడతలు పాకిస్తాన్ మీదుగా దేశంలోకి ప్రవేశిస్తాయని, ఆ దేశంలో కట్టడి చేస్తే పంటలకు పెద్దగా ప్రమాదం ఏమి ఉండదని చెబుతున్నారు.
మరోవైపు రాంటెక్లో ఉన్న మిడతల దండు ప్రయాణంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటుంది. రాష్ట్రం వైపు వస్తాయా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అక్కడ కట్టడి చేయడంతో విఫలమైతే తెలంగాణకు చేరుకుంటాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ శుక్రవారం లేదా శనివారం రెండు, మూడు జిల్లాలలో పర్యటించనున్నట్లు తెలిసింది.