వివాహ వేళ వివిధ సందర్భాల్లో పండితులు కథలు చెబుతారు. ఆదర్శదంపతుల కథలు వినడం వల్ల గృహస్థ జీవితంలో ఎలా మసలుకోవాలో కొత్త దంపతులకు తెలుస్తుంది. గృహస్థులు ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా దంపతీ సమేతులైన దేవతలకు నమస్కరించి ప్రారంభిస్తారు.
ఉమా మహేశ్వరాభ్యాం నమః లక్ష్మీనారాయణాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః
అరుంధతీ వశిష్టాభ్యాం నమః సీతారామాభ్యాం నమః అంటూ ఆరుగురు ఆదర్శదంపతులను ప్రతిశుభకార్యంలోనూ స్మరించి నమస్కరిస్తారు. వారిలో సప్తర్షీ మండలంలో స్థానం పొందిన సాధ్వి అరుంధతిని ఆదర్శంగా తీసుకుని కాపురం సాగించమని వధువుకు బోధిస్తారు. వశిష్ఠునివలె శాంతచిత్తునివై గృహస్థ ధర్మాలను పాటించమని వరునికి చెబుతారు. అందుకే వివాహవేళ అరుంధతీ దర్శనం చేయిస్తారు. అరుంధతీ దర్శనం కొత్తదంపతులకు దాంపత్య వైభవాన్ని తెలియజేస్తుంది. అన్యోన్యతనను నేర్పుతుంది. ఆయురారోగ్య, భోగభాగ్యాలను ఇస్తుంది. ఆకాశంలో నాలుగు నక్షత్రాలు మంచం కోళ్లలాగ ఉంటాయి. వాటిలో నాలుగో నక్షత్రానికి పక్కగా తోకలా కింది భాగాన మరోమూడు నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ ఏడు నక్షత్రాలను కలిపి సప్తర్షులంటారు. తోకలా ఉన్న మూడు నక్షత్రాల్లో మధ్యది వశిష్టుడు. దానిని ఆనుకుని చిన్నగా కనిపించే నక్షత్రమే అరుంధతి. శిశిర, వసంత, గ్రీష్మరుతువుల్లో అరుంధతీ నక్షత్రం సాయంవేళ కానవస్తుంది. మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి దాటిన తరువాత తెల్లవారుజామున కనిపిస్తుంది.
Arundhati nakshatram story in telugu