Saturday, July 27, 2024

జెండా పాటకు పాతర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర కోసం మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం జెండా పాట కంటే నాలుగు వేల రూపాయలు తగ్గించి కొనుగోళ్ళు చేస్తుండటం తో కడుపురగిలిన మిర్చి రైతులు కన్నేర్ర చేశారు. గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే మిర్చి క్విం టాలుకు రూ.3 వేలు నుంచి రూ.4 వేల వరకు వరకు తగ్గించడంతో రైతుల భగ్గుమన్నారు. తగ్గించిన ధరలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మార్కెట్ కార్యాలయం ప్రధాన గేట్లలో మిర్చి బస్తాలను అడ్డుగా వేసి రైతులు బైఠాయించారు. శుక్రవారం మార్కెట్ కు దాదాపు 50వేల మిర్చి బస్తాలను రైతులు తీసుకువచ్చారు.

జెండా పాట క్వింటాలుకు రూ. 20800 ఉండగా ఖరీదుదారులు మాత్రం రూ.14 వేల నుంచి రూ.16 వేల కే అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్ గేటు ముందు మిర్చి బస్తాలు అడ్డు పెట్టి కొనుగోలు జరగకుండా అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని గేటు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ అధికారులకు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు, మార్కెట్ సిబ్బంది శాంతింపజేసినా రైతులు వినకుండా ఆందోళన కొనసాగించారు. మార్కెట్‌కు అధికంగా సరుకు రావడంతో వ్యాపారులంతా సిండికేట్ అయి ఉద్దేశ్యపూర్వకంగానే ధరను ఒకేసారి నాలుగు వేలకు పైగా తగ్గించారని రైతులు ఆరోపించారు. శుక్రవారం నాటి జెండా పాటకు కేవలం ముగ్గురు కొనుగోలుదారులు వచ్చి తమ నోట్లో మట్టి కొట్టారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో జరిగిన రైతుల ధర్నా గురించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆరా తీశారు. సచివాలయంలో మార్కె టింగ్ డైరెక్టర్‌ను పిలిపించి ఆమెతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి అధికారుల తీరుపట్ల అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించినట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News