Tuesday, April 30, 2024

రక్తదానం సేవలో టిఎస్ ఆర్టీసికి అవార్డు

- Advertisement -
- Advertisement -

Award to TSRTC in Blood Donation Service

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజా రవాణా సేవలోనే కాదు సామాజిక సేవలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న టిఎస్ ఆర్టీసికి రక్తదానం సేవకు గాను అవార్డు లభించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మంగళవారం రాజభవన్ కమ్యూనిటీ హాల్ (సంస్కృతీ)లో అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ రక్తదానం చేయడానికి ప్రజల్లో చైతన్యాన్ని కల్పించిన ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు పురస్కారాలను అందజేశారు.

ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే మార్గనిర్ధేశంలో సంస్థ విసి అండ్ ఎండి విసి సజ్జనార్, ఐపిఎస్ నేతృత్వంలో 2021 నవంబర్ 30వ తేదీన రక్తదాన బృహత్తర సేవా కార్యక్రమాన్ని ఆర్టీసి నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని డిపోలు, ప్రధాన బస్‌స్టేషన్లలో సామూహిక రక్తదాన శిబిరాలు నిర్వహించడంలో వారిద్దరూ కీలక పాత్ర పోషించారు. దాదాపు 5,000 మంది ఉద్యోగులు, వారి బంధువులు, స్నేహితులు, ప్రయాణికులు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. దీనికిగాను టిఎస్ ఆర్టీసికి అవార్డు లభించింది. సంస్థ విసి అండ్ ఎండి తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఒ), సంస్థ కార్యదర్శి పివి మునిశేఖర్ ఈ పురస్కారాన్ని గవర్నర్ చేతుల మీదుగా మంగళవారం అందుకున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి అవార్డు లభించడం పట్ల సంస్థ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

రక్తదానం చేయండి – ప్రాణదాతలుగా మారండి

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, ఆపద సమయంలో ఆదుకోవాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, విసి అండ్ ఎండి విసి సజ్జనార్, ఐపిఎస్‌లు కోరారు. సంపూర్ణ ఆరోగ్యవంతుల రక్తం అనారోగ్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగపడుతుందని, అందుకే రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని వారు సూచించారు. సంస్థ కొన్ని నెలల క్రితం నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. రక్తదాన సేవను గుర్తించి సంస్థకు అవార్డు అందించడంపై నిర్వహకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News