న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకు మార్గాల కోసం ప్రపంచమంతా అన్వేషిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో శరీరం లోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా కరోనా ప్రభావాన్ని తగ్గించ వచ్చని, ఆ వ్యాధి నుంచి మరింత వేగంగా కోలుకునేలా చేయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేద ఓషధులు తులసి, నల్లమిరియాలు, శొంఠి, లవంగాలు, ఎండు ద్రాక్ష, కిస్మిస్ వంటివి సేవించడం, క్రమం తప్పకుండా యోగాసనాలు చేయడం హానికరమైన వైరస్లకు వ్యతిరేకంగా శరీరం లోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం పూట 10 గ్రాముల చ్యవనప్రాస తీసుకోవడంతోపాటు వంటకాల్లో పసుపు, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి వంటివి ఉపయోగించాలని, బెల్లం, తాజా నిమ్మ రసం కూడా వైరస్ నివారణకు పనిచేస్తుందని సూచించారు. ఓషధుల ఉత్పత్తుల తయారీ సంస్థ ఎఐఎంఐఎల్ ఫార్మా ఎగ్జికూటివ్ డైరక్టర్ సంచిత్ శర్మ వైరస్కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడమే మనకు రక్ష అని ప్రధాని మోడీ చెప్పడాన్ని స్వాగతించారు. రోగనిరోధక శక్తిని పెంచే ఓషధ ఔషధం ఫిఫట్రోల్ను ఈ సంస్థ తయారు చేసింది. ఆయుష్ మంత్రిత్వశాఖ కూడా శరీరం దృఢత్వానికి ప్రతిరోజూ వేడినీళ్లు తాగాలని, యోగాసనాలు అభ్యాసం చేయాలని, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ 30 నిముషాల పాటు చేయాలని సూచించింది.