అబుదాబి : ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో విజయం సాధించి జోరుమీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ముంబైపై బెంగళూరు భారీ స్కోరును సాధించింది. అయితే ఇషాన్ కిషన్, పొలార్డ్ విధ్వంసక బ్యాటింగ్తో ముంబై మ్యాచ్ను టైగా ముగించింది. కానీ సూపర్ ఓవర్లో నవ్దీప్ సైని అసాధారణ బౌలింగ్ను కనబరచడంతో బెంగళూరు విజయాన్ని అందుకుంది. ఇక రాజస్థాన్తో జరిగే మ్యాచ్లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. డివిలియర్స్, ఫించ్, పడిక్కల్, శివమ్ దూబే తదితరులతో బెంగళూరు బ్యాటింగ్ బలంగా ఉంది.
అయితే కెప్టెన్ కోహ్లి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కోహ్లి రాజస్థాన్పై చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇందులో ఎంతవరకు సఫలమవుతాడో వేచి చూడాల్సిందే. ఇక కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన రాజస్థాన్కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. బెంగళూరును ఓడించడం ద్వారా మళ్లీ గాడిలో పడాలని భావిస్తోంది. సంజు శాంసన్, స్మిత్, రాహుల్ తెవాటియా తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్ బలంగా ఉంది. వీరిలో ఏ ఇద్దరు రాణించిన జట్టుకు భారీ స్కోరు ఖాయం.
కోల్కతాతో ఢిల్లీ ఢీ
ఇక శనివారం జరిగే మరో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ తలపడుతాయి. తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన ఢిల్లీకి హైదరాబాద్ చేతిలో చుక్కెదురైంది. అయితే కోల్కతాను ఓడించడం ద్వారా మళ్లీ విజయాల బాట పట్టాలని ఢిల్లీ భావిస్తోంది. ఇక రాజస్థాన్పై ఘన విజయం సాధించిన కోల్కతా ఈ మ్యాచ్కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి మూడో విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది.