సెమీస్లో కర్ణాటకపై ఘన విజయం
కోల్కతా: ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టు ఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్లో బెంగాల్ 174 పరుగుల తేడాతో కర్ణాటకను చిత్తు చేసింది. 352 పరుగుల లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక 177 పరుగులకే కుప్పకూలింది. 98/3 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటకకు ఆరంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ బ్యాట్స్మన్ మనీష్ పాండే నిరాశ పరిచాడు. స్కోరు బోర్డు ఒక్క పరుగు మాత్రమే చేరగా ఆ వెంటనే మనీష్ పాండే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో కర్ణాటక కష్టాలు ప్రారంభమయ్యాయి. ముకేశ్ కుమార్ అద్భుత బంతితో మనీష్ను వెనక్కి పంపాడు. ఆ వెంటనే కృష్ణమూర్తి సిద్దార్థ్ (౦)ను కూడా ముకేశ్ ఔట్ చేశాడు. అతను ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
తర్వాతి బంతికే వికెట్ కీపర్ శ్రీనివాస్ శరత్ను కూడా ముకేశ్ బలిగొన్నాడు. ఆ తర్వాత కర్ణాటక మళ్లీ కోలుకోలేక పోయింది. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన దేవ్దుత్ పడికల్ 62 పరుగులు చేశాడు. ఈ వికెట్ను కూడా ముకేశ్ తన ఖాతాలో వేసుకున్నాడు. చివర్లో కృష్ణప్ప గౌతమ్ (22), అభిమన్యు మిథున్ 30 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ ఆరు వికెట్లు పడగొట్టగా, ఇషాన్ పొరెల్, ఆకాశ్ దీప్లకు రెండేసి వికెట్లు లభించాయి. కాగా, బెంగాల్ 2007 తర్వాత రంజీ ట్రోఫీలో ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.