Thursday, May 2, 2024

మండలి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌గా భూపాల్‌రెడ్డి
ముగిసిన ఆరుగురు ఎంఎల్‌సిల పదవీకాలం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌గా మెదక్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి భూపాల్ రెడ్డి వ్యవహరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భూపాల్ రెడ్డిని ప్రొటెం ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రొటెం ఛైర్మన్ హోదాలో శాసనమండలి ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించనున్న భూపాల్ రెడ్డికి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించే అధికారాన్ని కూడా అప్పగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 184(1) ప్రకారం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌ల ఎంఎల్‌సిల సభ్యత్వాల పదవీకాలం గురువారంతో ముగిసింది. దీంతో ప్రొటెం ఛైర్మన్ నియామకం అనివార్యమైంది. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి భూపాల్‌రెడ్డి ఎంఎల్‌సిగా కొనసాగుతున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రొటెం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆరుగురు ఎంఎల్‌సిలకు వీడ్కోలు
గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యాసాగర్‌తో పాటు చీఫ్ విప్‌గా ఉన్న బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాలం కూడా గురువారం పూర్తయ్యింది. శాసనమండలిలో జరిగిన కార్యక్రమంలో పదవీ కాలం ముగిసిన ఆరు ఎంఎల్‌సిలకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలితలను సన్మానించారు.

Bhoopal Reddy appointed as Legislative Council Chairman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News