Thursday, May 2, 2024

చంద్రయాన్-3 విజయం..యావద్భారతీయులది:కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజయవంతంగా దిగడం.. యావద్భారతం గర్వించే క్షణమని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ నిలిచిందన్నారు. బుధవారం చంద్రయాన్-3 ల్యాండ్ అయిన అద్వితీయమైన ఘట్టాలను.. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో.. ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్, ఇతర ముఖ్యనేతలతో కలిసి భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై కిషన్ రెడ్డి వీక్షించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందేశాన్ని వీక్షించారు. పార్టీ కార్యాలయంలో నాయకులు త్రివర్ణపతాకాలు చేతబూని భారత్ మాతాకీ జై, జై జవాన్ జై కిసాన్ – జై విజ్ఞాన్ నినాదాలు చేశారు.

టపాసులు కాల్చారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘ఈ విజయంతో భారత్ కొత్త చరిత్రను లిఖించిందన్నారు. ఇస్రో, చంద్రయాన్ బృందానికి హృదయపూర్వకంగా అభినందనలు. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేశారు. ప్రధాని మోడీకి, 140 కోట్ల మంది భారతీయులకు హృదయపూర్వకంగా అభినందనలను కిషన్‌రెడ్డి తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
చందమామ దక్షిణ రారాజులం మనమే.. : బండి
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ (అంతరిక్ష నౌక) విజయవంతం కావడం చాలా ఆనందంగా ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. చందమామ దక్షిణ ధ్రువ రారాజుగా భారత్ అవతరించడం మహా అద్భుతం. అనిర్వచనీయం. మాటల్లో చెప్పలేని ఆనందమిది. యావత్ భారతదేశం గర్వించాల్సిన క్షణాలివి. ఇంతటి గొప్ప అద్భుత విజయాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్తలకు బిజెపి పక్షాన మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.

గద్వాల జిల్లావాసితో తెలంగాణకు గర్వకారణం.. : డికె అరుణ
మహాద్భుతమైన విజయాన్ని సాధించిన చంద్రయాన్-3 శాస్త్రవేత్తల బృందానికి, ఇస్రోకు గర్వంగా శుభాకాంక్షలను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి గ్రామానికి చెందిన కృష్ణ కుమ్మరి, మిషన్ 2 పేలోడ్స్ (AHVC) (ILSA) కి డేటా ప్రాసెసింగ్ సాప్ట్‌వేర్ విభాగంలో కీలక పాత్ర వహించడం గద్వాల ప్రజలతోపాటు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని, కృష్ణ కుమ్మరితో పాటు అతని కుటుంబ సభ్యులకు డికె అరుణ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News