Tuesday, April 23, 2024

పంజాబ్ సిఎం మాన్ ఇంటివద్ద బాంబు కలకలం

- Advertisement -
- Advertisement -

చండీఘర్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం వద్ద బాంబుషెల్ లభించడం సోమవారం కలకలం సృష్టించింది. చండీఘర్‌లోని సిఎం మాన్ నివాసానికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్కాడ్ ఆ ప్రాంతం నుంచి దాన్ని తరలించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అధికారికంగా ఉపయోగించే హెలిప్యాడ్ వద్ద పదార్థంగా అనుమానిస్తున్న పరికరాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు. సిఎం నివాసానికి సమీపంలో పేలుడు పరికరం లభ్యమవడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. భారతసైన్యానికి చెందిన వెస్ట్రన్ కమాండ్ దీనిపై దర్యాప్తు చేపట్టింది. సోమవారం సాయంత్రం 4, 4.30 సమయంలో మామిడితోటకు నీటిని సరఫరా చేసే మోటారు ఆపరేటరు ఒకరు బాంబుషెల్‌ను గుర్తించారు.

సిఎం నివాసం, హెలిప్యాడ్‌కు సమీపంలో ఈ మామిడితోట ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. షెల్‌ను గుర్తించిన సమయంలో సిఎం మాన్ ఇంట్లో లేరని ఆ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా సిఎం సెక్యూరిటీ చీఫ్ ఎకె పాండే మాట్లాడుతూ ఇది బాంబుకేసు కాదని మిస్‌ఫైర్ అయిన షెల్‌గా పేర్కొన్నారు. ఇటువంటి షెల్స్ ఇంతకుముందు కూడా లభ్యమయ్యాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కాగా భద్రతాదళాలు బాంబు షెల్ ఆ ప్రాంతంలో ఎలాపడిందో దర్యాప్తు చేస్తున్నట్లు చండీఘర్ అధికారులు తెలిపారు. బాంబు స్క్వాడ్ సహాయంతో భద్రత పెంచామని నోడల్ అధికారి కుల్దీప్ కోహ్లీ మీడియాకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News