Tuesday, May 21, 2024

కన్నతల్లిని కడతేర్చిన కసాయి కుమారుడికి జీవితఖైదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కన్నతల్లిని కడతేర్చిన కసాయి కుమారుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రెండు సంవత్సరాల క్రితం ఈ నేరం హైదరాబాద్‌లో జరగగా, తాజాగా నిందితుడ్ని కోర్టు దోషిగా తేల్చి శిక్ష వేసింది. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేట్ లో ఈ దారుణం సంభవించింది. గంజాయికి బానిసైన కొడుకు తన కన్న తల్లిని కత్తితో రెండు సంవత్సరాల క్రితం విచక్షణారహితంగా తూట్లు తూట్లుగా పొడిచి చంపాడు. కన్న తల్లి సంగీత కడుపు కోసి పేగులు బయటకు లాగి అత్యంత భయానక రీతిలో దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ కుమారుడి పేరు సంతోష్ అలియాస్ సంతు. తన తల్లి అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేదనే సంతోష్ ఈ హత్యకు పాల్పడ్డాడు.

ప్రాసిక్యూషన్ నేరం నిరూపించడంతో దోషి సంతోష్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. రెండేళ్ల కాలంలోనే దోషికి శిక్ష పడేలా ఆధారాలను ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. వీరిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. కర్ణాటకకు చెందిన 57 ఏళ్ల సంగీత బల్కంపేటలో కొడుకు సంతోశ్ (24)తో కలిసి నివాసం ఉండేది. అనారోగ్యం బారిన పడిన సంగీత భర్త వీరప్ప ఏడాది క్రితం చనిపోయాడు. సంగీతకు ఓ కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకైన సంతోష్ కు మతిస్థిమితం సరిగా లేదని అప్పట్లో స్థానికులు చెప్పారు. అయితే, సంగీత ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. కుమార్తెకు వివాహం కాగా, పెద్ద కొడుకు, చివరి కొడుకు సంతోష్ కు వివాహాలు కావాల్సి ఉంది. పెద్దకొడుకు ఆటో డ్రైవర్ గా పని చేసుకుంటుండగా, చిన్న కొడుకు సంతోష్ జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు.

2021 జనవరి నెలలో రోజూ మాదిరిగానే ఇళ్లలో పని చేసిన సంగీత మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంటికి వచ్చింది. డబ్బుల కోసం సంతోష్ తల్లితో గొడవ పడ్డాడు. డబ్బులు ఇవ్వడానికి తల్లి ఒప్పుకోకపోవడంతో ఇంట్లో కూరగాయలు తరిగే కత్తి తీసుకొచ్చి తల్లి పొట్ట భాగంలో పొడిచాడు. అదే కత్తితో పొట్టను చీరేశాడు. పేగులు బయటపడి రక్తపు మడుగులో కుప్పకూలి సంగీత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణాన్ని దగ్గరుండి చూసిన చిన్న కూతురు భయంతో వణుకుతూ ఓ గదిలోకి వెళ్లి ఘడియ వేసుకుంది. జరిగిన విషయం గురించి ఆమె తన బాబాయ్‌కి ఫోన్ చేసి చెప్పింది. తల్లీకొడుకుల మధ్య పెనుగులాట జరుగుతున్న సందర్భంగా అరుపులు విన్న స్థానికులు తలుపులు తెరిచి చూడగా, సంగీత రక్తపు మడుగులో పడి ఉండడం గుర్తించారు. తలుపు తెరవగానే పారిపోయేందుకు సంతోష్ ప్రయత్నించగా, స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News