Sunday, April 28, 2024

నేలాఖరులోగా పదవుల పందేరం?

- Advertisement -
- Advertisement -

నామినేటెడ్ పోస్టుల భర్తీకి సిఎం కసరత్తు

పతి ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు లేదా నలుగురికి పదవులు
ఇన్‌చార్జి మంత్రుల నేతృత్వంలో అభ్యర్థుల జాబితా రూపకల్పన
సంక్రాంతిలోపు కొన్ని పదవులు భర్తీచేసే అవకాశం?

మన తెలంగాణ/ హైదరాబాద్:  ఈ నెలాఖరులో గా నామినేటెడ్ పోస్టులు, డైరెక్టర్ పోస్టులు, 33 జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, సభ్యుల ను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముందస్తుగా కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులను భ ర్తీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో సిఎం ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సం క్రాంతిలోపు 20 నుంచి 25 మందికి నామినేటె డ్ పోస్టులు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలిసిం ది. మిగతా వారిని ఈనెలాఖరులోగా ఈ పోస్టు ల్లో నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలిసిం ది. వచ్చేనెలలోపు ఎన్నికల కోడ్ అవకాశం ఉం డడం, లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సీట్ల ను గెలుచుకోవాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని ఆశావహులు, అసంతృప్తులు, టికెట్‌లను త్యాగం చేసిన వారిని ఈ పోస్టుల్లో నియమిస్తే పార్టీకి మేలు జరగడంతో పాటు రానున్న ఎన్నికల్లోనూ అధికసీట్లను గెలుచుకోవచ్చని సిఎం భావిస్తున్నట్టుగా తెలిసింది.
ముగ్గురు లేదా నలుగురు
ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో జిల్లాకు ముగ్గురు లేదా నలుగురు చొప్పున కనీసం 25 నుంచి 30 మందికి ఈ పోస్టులు ఇవ్వాలని సిఎం ఆలోచనగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలు పెట్టినట్టుగా తెలిసింది. ఇన్‌చార్జీ మంత్రుల నేతృత్వంలో నామినేటెడ్ పదవుల అభ్యర్థుల జాబితానూ ఇప్పటికే టిపిసిసి సైతం సేకరించింది. ఆ జాబితాలోని పేర్లను వడబోసి ప్రభుత్వానికి సింగిల్ నేమ్ తో జాబితా పంపనుంది. సిఎం, కేబినెట్ మంత్రుల నిర్ణయంతో కార్పొరేషన్ చైర్మన్లను ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తోంది.
లీడర్లు, కార్యకర్తల్లోనూ భరోసా
సంక్రాంతిలోపు కొన్ని నామినేటెడ్ పదవులు నింపితే సెకండ్ కేడర్, క్షేత్రస్థాయి లీడర్లలో కొంత జోష్ వస్తుందనేది పార్టీ విశ్వాసం. చైర్మన్ పదవులు ఇవ్వడం వలన ఆయా నేతలు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా, అనుచరులనూ ప్రోత్సహిస్తూ పార్టీ విజయానికి ఉత్సాహంగా కృషి చేస్తారని టిపిసిసి భావిస్తోంది. పైగా నామినేటెడ్ పదవుల ప్రకటన మొదలైతే లీడర్లు, కార్యకర్తల్లోనూ పార్టీపై భరోసా పెరుగుతుందని సిఎం భావించిన నేపథ్యంలో సంక్రాంతి లోపు నామినేటెడ్ పదవుల జోష్ మొదలు కానుంది.
గవర్నర్ కోటా ఎంఎల్‌సి అభ్యర్థులు వీరే..
గవర్నర్ కోటా ఎంఎల్‌సిలకు సంబంధించి అభ్యర్థుల ఖరారులో ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డికి ఒక స్పష్టతతో ఉన్నట్టుగా సమాచారం. రెండింటిలో ఒకటి టిజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్, మరో స్థానం కోసం అందెశ్రీ పేరు పరిశీలనలో ఉంది. పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి తీన్మార్ మల్లన్న పేరు పరిశీలనలో ఉంది. రెండు ఎంఎల్‌ఎల కోటా ఎంఎల్‌సి స్థానాలకు అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి, సంపత్, మధుయాష్కీగౌడ్, షబ్బీర్ అలీ, ఫిరోజ్‌ఖాన్, అజారుద్ధీన్ వంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణను లోక్‌సభ ఎన్నికల్లోగానే చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో మంత్రివర్గంలోకి తీసుకునే వారికే ఎంఎల్‌ఎల కోటా ఎంఎల్‌సిలుగా అవకాశం ఇవ్వాలని సిఎం భావిస్తున్నట్టుగా తెలిసింది.
దేవాలయాల పాలకమండళ్ల నియామకం..
రాష్ట్రంలో 54కార్పొరేషన్ల చైర్మన్లను, డైరెక్టర్లను, 33 జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో ఇప్పుడు ఈ పదవులను భర్తీ చేయనుండటంతో కాంగ్రెస్ ఆశావహులు వాటిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. వీటితో పాటు యాదాద్రి సహా రాష్ట్రంలోని పలు దేవాలయాలకు పాలక మండళ్లను కూడా నియమించాల్సి ఉంది. దేవాలయ పాలక మండళ్ల భర్తీ ద్వారా కూడా మరికొందరికి పదవుల భాగ్యం దక్కనుంది. రాష్ట్రంలో భద్రాచలం సీతా రామచంద్ర స్వామి, మేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి, యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి, బాసర జ్ఞాన సరస్వతి, కీసరగుట్ట క్షీరరామలింగేశ్వరస్వామి, ఉజ్జయిని మహంకాళి, సమ్మక్క సారలమ్మ, కొమురవెల్లి మల్లికార్జున, కురవి వీరభద్రస్వామితో పాటు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవసానం తదితరాలు ప్రముఖమైనవి.
ఎంఎల్‌సి టికెట్ కోసం భారీ క్యూ
నామినేటెడ్ పోస్టులతో పాటు రెండు గవర్నర్ కోటా రెండు ఎంఎల్‌సిలు, రెండు ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సిలు, ఒక పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానం కోసం ఆశావహులు సిఎం రేవంత్ దగ్గరకు క్యూ కడుతున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి అధిష్టానంతో చర్చించిన రేవంత్‌రెడ్డి ఎంఎల్‌సి అభ్యర్థుల ఎంపికపై కూడా పూర్తిస్థాయి నిమగ్నమైనట్టుగా తెలిసింది. ముఖ్యంగా కార్పొరేషన చైర్మన్ల కోసం సొంత పార్టీలో సిఫారసుల ఒత్తిడి అధికంగా ఉండటంతో ఆయన ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఈ విషయాన్ని చేరవేస్తున్నట్టుగా తెలిసింది.
మార్కెట్ కమిటీ పాలక మండళ్లు సైతం…
అలాగే మార్కెట్ కమిటీ పాలక మండళ్లను కూడా భర్తీ చేయాల్సి ఉంది. రైతు సమన్వయ సమితి రాష్ట్ర, జిల్లా అధ్యక్షులను నియమించాల్సి ఉంది. రైతు సమితిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదోనన్న దానిపై స్పష్టత లేదు. ఇకపోతే రెండేళ్ల కాలపరిమితితో ఉండే చైర్మన్ పదవుతో పాటు డైరక్టర్ పోస్టులను భర్తీ చేసిన పక్షంలో ఐదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో రెండు దఫాలుగా రెండు పాలక వర్గాలకు అవకాశం కల్పించడం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీని త్వరితగతిన పూర్తి చేసి పార్టీ నాయకులను సంతృప్తి పరిచినట్లయితే వారు లోక్‌సభ సహా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.
ఈ నెలాఖరులోగా సర్పంచ్‌ల పదవుల కాలం పూర్తి…
జనవరి 31వ తేదీతో సర్పంచ్‌ల పదవీ కాలం ముగియనుంది. పంచాయతీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తారా లేక పర్సన్ ఇన్‌చార్జీలుగా సర్పంచ్‌లకు అవకాశమిస్తారా లేక స్పెషల్ ఆఫీసర్ల పాలన నడిపిస్తారా అన్నది తేలాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికలు జరిగేలోపు లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. ఆ వెంటనే ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలు, డిసిసిబి చైర్మన్ ఎన్నికలు, చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆయా ఎన్నికల్లో నెగ్గాలంటే ఒకవైపు పాలన పరంగా ప్రభుత్వం సముచిత నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఇంకోవైపు పార్టీ కోణంలో పదవుల సర్దుబాటు, ఆయా ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక సమర్ధవంతంగా నిర్వహించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పదవుల పంపకంపై సిఎం రేవంత్ దృష్టి సారించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News