Sunday, April 28, 2024

నామినేటెడ్ పదవుల కోసం హస్తం నేతల ఆరాటం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: హస్తం నేతలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. పది సంవత్సరాలుగా పదవులు లేక డీలా పడిన నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో మాకు మంచిరోజులు వచ్చాయి.త్వరలోనే మాకందరికి పదవులు వస్తాయన్న కొత్త ఆశతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్న సమయంలో పార్టీకి అండగా నిలిచి ప్రజల తరపున పోరాటం చేసిన నేతలతో పాటు పలువురు పార్టీ, ప్రభుత్వ నామినేటేడ్ పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి జిల్లాలో టికెట్‌లు ఆశీంచి బంగపడిన నేతలతో పాటు పార్టీ అభ్యర్దులు కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు నామినేటేడ్ పదవులలో ప్రాముఖ్యత దక్కనుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జిల్లా నేతలతో వ్యక్తిగత సంబందాలు ఉండటంతో పార్టీ కోసం వ్యయ, ప్రయాసలకు ఓర్చిన నేతలకు ఖచ్చితంగా గుర్తింపు ఇస్తారన్న ఆశలో జిల్లా నేతలు ఉన్నారు. శాసనసభ ఎన్నికలలో వికారాబాద్ జిల్లాలోని నాలుగు స్థానాల్లో హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేయగా రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది స్థానాలకు గాను ఇబ్రహింపట్నం, షాద్‌నగర్, కల్వకుర్తి స్థానాల్లో విజయం దక్కించుకోగా చెవెళ్లలో స్వల్ప ఓట్లతో పరాజయం పాలైంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్.బి.నగర్, శేరిలింగంపల్లి స్థానాల్లో పోటి ఇచ్చిన పరాజయం తప్పలేదు. మేడ్చల్ జిల్లాలోని ఐదు స్థానాల్లో పార్టీ పరాజయం పాలైంది.

నామినేటేడ్ పదవుల పంపకాల్లో పార్టీ విజయం సాదించిన స్థానాలతో పాటు పరాజయం పాలైన స్థానాల్లో భవిష్యత్ అవసరాలకు దృష్టిలో ఉంచుకుని నామినేటేడ్ పదవులు కట్టబెట్టి పార్టీ పటిష్టం కోసం ప్రయత్నాలు చేయనున్నారు. గత శాసనసభ ఎన్నికలలో పోటి చేసి స్వల్ప ఓట్లతో పరాజయం పాలైన వారికి పదవులు ఇచ్చి నియోజకవర్గాల్లో శాసనసభ్యులకు దీటుగా కార్యక్రమాలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో శాసనసభ ఎన్నికలలో పరాజయం పాలైన నేతలు మదుయాష్కి (ఎల్.బి.నగర్) పార్టీలో కీలక పదవి కట్టబెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. భీంభరత్ (చేవెళ్ల), నరేందర్ ముదిరాజ్ (రాజేంద్రనగర్)లకు సైతం నామినేటెడ్ పదవులు ఖాయమన్న విశ్వాసం వారి క్యాడర్ లో కనిపిస్తుంది. మహేశ్వరం బరిలో నిలిచి ప రాజయం పాలైన కిచ్చన్నగారి లకా్ష్మరెడ్డికి చేవెళ్ల పార్లమెంట్ సీటు ఇవ్వనున్నారని లేని పక్షంలో కీలకపదవి దక్కడం ఖాయమని సమాచారం.

పదవులు తక్కువ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పదవులపై ఆశలు పెట్టుకున్న నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఆయా కార్పొరేషన్‌లలో డైరెక్టర్‌లు ఇతర పదవులపై నేతలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లా స్థాయిలో గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీలతో పాటు ఇతర పదవులపై ద్వితీయ శ్రేణి నాయకులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపిపి, జడ్పీటిసి, సర్పంచ్ తదితర స్థానిక సంస్థల పదవులకు సమయం ఉండటంతో ఇప్పటికిప్పుడు కేవలం నామినేటేడ్ పదవులపై నేతలు ఆశలు పెట్టుకున్నారు.

ప్రభుత్వ నామినేటేడ్ పదవులు దక్కని వారికి పార్టీ పరంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో కీలకపదవులు దక్కించుకుని స్థానిక సంస్థలలో పోటిచేసి జడ్పీ చైర్మెన్ వంటి కీలకపదవులు దక్కించుకోవాలని చాలా మంది నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. జిల్లాలోని శివారులలో కార్పొరేషన్‌లలో మేయర్, డిప్యూటి మేయర్, మున్సిపల్ చైర్మెన్ వంటి కీలకపదవులపై సైతం చాలా మంది నేతలు ముందస్తు ప్లాన్‌లు వేసుకుంటున్నారు. జిల్లా స్థాయిలో పార్టీ ప్రక్షాళన సైతం చేసి కొత్త ముఖాలకు పార్టీ పదవులు ఇవ్వనున్నారని ప్రచారం.

ఆశావహులు అధికం: ఉమ్మడి జిల్లాలో నామినేటేడ్ పదవుల ఆశావాహూల సంఖ్య చాలా అధికంగా ఉంది. శాసనసభ ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా పలువురికి ఎమ్మెల్సీలతో పాటు పలు వాగ్దానాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, కొత్తూర్ మాజీ ఎంపిపి శ్యాంసుందర్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు చల్లా నర్సింహరెడ్డి, బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహరెడ్డి, ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, చేవెళ్ల నాయకులు వసంతం, దర్శన్ రాజేంద్రనగర్ నేతలు ముంగి జైపాల్‌రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాచమల్ల సిద్దేశ్వర్, మల్‌రెడ్డి రాంరెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డిలతో పాటు పలువురు రాష్ట్ర స్థాయి పదవులు ఆశీస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలు చాలా మంది రాష్ట్రస్థాయిలో డైరెక్టర్‌లు, జిల్లా స్థాయి చైర్మెన్‌లపై ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతి పర్వదినం తరువాత పదవులు దక్కుతాయా..పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తరువాత కట్టబెడుతారా అన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ పదవుల పంపకాలపై జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతల జాబితాలను ఇప్పటికే సిద్దం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరిగేలా పదవుల పంపకాలు జరుగుతాయని నేతలు ఆశీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News