హైదరాబాద్: స్థానిక సంస్థల బడ్జెట్లో పది శాతం నిధులు గ్రీనరీ పెంచేందుకు కేటాయించామని భవన నిర్మాణ అనుమతులు సెల్ప్ సర్టిఫికేషన్తో ఇస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. దేశంలో 4300 పట్టణాలకు పోటీ నిర్వహిస్తే తెలంగాణకు 12 అవార్డులు వచ్చాయని కొనియాడారు. మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో తెలంగాణకు జాతీయ అవార్డు వచ్చిందని, నగరాల విభాగంలో జాతీయ స్థాయిలో కరీంనగర్కు అవార్డు వచ్చిందని ప్రశంసించారు.
జిహెచ్ఎంసికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు వచ్చిందన్నారు. తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్టణ ప్రగతికి కేంద్రం ఇచ్చిన గుర్తింపు అని కొనియాడారు. 101 పట్టణాలకు ఒడిఎఫ్ ప్లస్, 8 పట్టణాలకు ఒడిఎఫ్ ప్లస్ ప్లస్ గుర్తింపు వచ్చిందని, హైదరాబాద్కు వాటర్ ప్లస్ సిటీగా గుర్తింపు లభించిందని, ప్రధాన మంత్రి స్వనిధి విభాగంలో వందశాతం పూర్తి చేసిన సిటీగా జిహెచ్ఎంసికి గుర్తింపు వచ్చిందని, కేంద్ర ప్రభుత్వ అవార్డులతో పాటు అనేక ఇతర పురస్కారాలు వచ్చాయని, ఈ నెల 20న కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేస్తోందన్నారు. పురోగమిస్తున్న తెలంగాణలో పట్టణాలకు మరింత సహకారం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నామని, గతంలో పారిశుద్ధ కార్మికులకు మూడు, నాలుగు నెలలకోసారి జీతాలు ఇచ్చేవాళ్లు అని గుర్తు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి నెల జీతాలు ఇస్తున్నామన్నారు. దక్షిణాదిలో అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ హైదరాబాద్లో ఏర్పాటు చేశామని, ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉందని, ప్రజల అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పనులు చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు.