మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మరో దఫా జిఎస్టి బకాయిలను విడుదల చేసింది. 13వ విడత కింద రూ.6వేల కోట్లను మంజూరు చేసింది. దీంతో ఇప్పటి వరకు కేంద్రం మొత్తంగా రూ.78వేల కోట్లను విడుదల చేసినట్లు అయింది. జిఎస్టి విధానం వల్ల పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేసేందుకుగానూ కేంద్ర ఆర్ధిక శాఖ ఈ పరిహారాన్ని దశల వారిగా మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం స్పెషల్ బారోయింగ్ ప్లాన్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రూ. 1,336.44 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి రూ.1,810.71 కోట్లు మంజూరు చేసింది. గత సంవత్సరం డిసెంబర్ మాసంలో నిధులు మజూరు చేయగా, ఇప్పుడు మరోసారి కేంద్ర ఆర్ధిక శాఖ పరిహారం అందించింది. ఇందులో 23 రాష్ట్రాలకు రూ.5,516.60 కోట్లును మంజూరు చేయగా జిఎస్టిలో కౌన్సిల్ సభ్యులుగా ఉన్న ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలకు కలిపి రూ.483.40 కోట్లు విడుదల చేశారు.
కాగా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కింలకు జిఎస్టి అమలు కారణంగా ఆదాయంలో అంతరం లేదని మంత్రిత్వ శాఖ పేర్కొన్నాది. ఇప్పటివరకు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా రూ.78వేల కోట్లను సగటున 4.74 శాతం వడ్డీ రేటుతో అప్పుగా తీసుకుందని తెలియజేసింది. రాష్ట్రాలకు సహాయం చేయడానికి స్థూల రాష్ట్రాల దేశీయ ఉత్పత్తి (జిఎస్డిపి)లో 0.50 శాతానికి సమానమైన అదనపు రుణాలు తీసుకునే అనుమతిని కేంద్రం ఇచ్చింది. ఈ నిబంధన ప్రకారం 28 రాష్ట్రాలకు మొత్తం 1,06,830 లక్షల కోట్ల రూపాయలు(జిఎస్డిపిలో 0.50 శాతం) రుణం తీసుకోవడానికి అనుమతి మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
Centre releases GST Compensation to Telangana