Saturday, April 27, 2024

నీట్ తెచ్చిన చేటు.. గవర్నర్ రాజకీయ రగడ

- Advertisement -
- Advertisement -

చెన్నై : నీట్ పరీక్ష చెన్నైకు చెందిన ఓ కుటుంబంలో కోలుకోలేని విషాదాన్ని నింపింది. రెండుసార్లు నీట్ వైద్య శాస్త్ర పరీక్ష రాసి, ఫెయిల్ కావడంతో ఈ కుటుంబానికి చెందిన 19 సంవత్సరాల యువకుడు జగదీశ్వరన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణం భరించలేక రెండు రోజుల తరువాత ఆయన తండ్రి కూడా బలవన్మరణం చెందారు. ఎంతకష్టపడి చదివినా నీట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోవడం, డాక్టరు కావాలనే తన ఆకాంక్ష ఈడేరే పరిస్థితి లేదని కుమిలి ఈ టీనేజ్ బాబు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

కొడుకే తన లోకం అని భావించుకున్న తండ్రి కూడా ఇదే బాట పట్టడం కుటుంబంలో నెలకొన్న విషాద పరిస్థితిని చూసి స్థానికుల్లో తీవ్ర విచారం నెలకొంది. నగరంలోని క్రోమ్‌పేట ప్రాంతంలో ఉన్న తమ ఇంట్లో జగదీశ్వరన్ ఈ నెల 12వ తేదీన ఉరివేసుకుని చనిపోయి ఉండగా గుర్తించారు. కాగా రెండురోజులకు సోమవారం తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్మీడియట్‌లో 427 మార్కులు సాధించిన జగదీశ్వరన్ నీట్ తనకు ఇక ఉన్నతచదువు అందని ద్రాక్షే అని భావించి ఈ విధంగా బతుకు చాలించాడు. విద్యార్థి విషాదాంతం, ఈ కుటుంబానికి తలెత్తిన నష్టంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు.

విద్యార్థులు ఈ విధంగా ఆత్మహత్యల ఆలోచనలకు దిగరాదని, జీవితంలో పరీక్షలు ముఖ్యమే కానీ వీటి ఫలితాలే జీవితాలను నిర్ధేశిస్తాయని భావించరాదని కోరారు. యువతరం ఆత్మవిశ్వాసం సంతరించుకుని, జీవితగమనం సాగించాలని పిలుపు నిచ్చారు. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో 2021లో నీట్ పరీక్ష నుంచి మినహాయింపు కల్పించే బిల్లును ఆమోదించారు. మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నీట్ ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన వల్ల విద్యారంగంలో అనుచిత వాతావరణం ఏర్పడుతోందని బిల్లులో తెలిపారు.

సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులే ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో అత్యధిక ఫీజులైనా చేరి పరీక్షల నుంచి గట్టెక్కుతున్నారు. కాగా పేదింటి ప్రతిభావంతులైన విద్యార్థులు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ విషయంలో పోటీని తట్టుకోలేకపోతున్నారని, దీనితో అర్హత పరీక్షలలో అత్యధిక మార్కులు పొందినా వీరు ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారని , దీనిని చక్కదిద్దాల్సి ఉందని బిల్లు ద్వారా తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ బిల్లును గవర్నర్ ఆర్‌ఎన్ రవి చాలా ఆలస్యం తరువాత తిప్పి పంపించారు.

తరువాత అసెంబ్లీ దీనికి మళ్లీ ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. నీట్ అడ్డుగోడలు తొలిగిపోతాయని, రాబోయే రాజకీయ మార్పుల దశలో ఈ విషమ పరీక్ష నుంచి విముక్తి ఉంటుందని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. పద్ధతి ప్రకారం బిల్లును రాష్ట్రపతికి పంపించారు అయితే దీనిపై తాను సంతకం చేసేది లేదని విషయం వివాదాస్పదం అవుతూ వస్తూ ఉన్నా గవర్నర్ రవి తన వైఖరి వీడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News