Thursday, May 2, 2024

‘లా’వెక్కని స్త్రీలు

- Advertisement -
- Advertisement -

CJI NV Ramana rues lack of women in judiciary

న్యాయవాద వృత్తిలో మహిళలకు తక్కువ ప్రాధాన్యం

ఇప్పుడిప్పుడే కొంత మార్పు వచ్చింది సుప్రీంకోర్టులో వారికి 11శాతం ప్రాతినిథ్యం దక్కింది, ఇది కూడా నామమాత్రమే మహిళా లాయర్లు ఎదుర్కొన్న కష్టాలు నేను చూశాను ఒకేసారి 9మంది న్యాయమూర్తులు
బాధ్యతలు తీసుకోవడం అందులో ముగ్గురు మహిళలు ఉండడం ఇదే
మొదటిసారి అనేక కారణాల వల్ల న్యాయవాద వృత్తి గ్రామాలకు
విస్తరించడం లేదు చాలాకాలంపాటు సంపన్నులకే
పరిమితమై ఉంది : బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభినందన, సన్మాన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ

న్యూఢిల్లీ : న్యాయవాద వృత్తి పరిమితం కావడం, సమగ్రవిస్తరణానికి నోచుకోకపోవడం బాధాకరమే అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ తెలిపారు. న్యాయవృత్తి సంపన్నుల వృత్తిగా భావించడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారుతోంది. ఇక లాను వృత్తిగా మలుచుకోవడంలో మహిళలు పలు చిక్కులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తికి శనివారం సన్మాన అభినందన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా జస్టిస్ రమణ ప్రసంగించారు. బార్ అసోసియేషన్ నుంచే తాను అయినా ఇతర న్యాయమూర్తులు అయినా అత్యున్నత స్థానాలకు ఎదిగారని, న్యాయవాద వృత్తి ఏ పరిస్థితుల్లో ఉంది? ఎటునుంచి ఎటువెళ్లుతున్నది అనేది తాను తరచూ ఆలోచిస్తూ ఉంటానని తెలిపారు. లా చదవడం, లాయర్‌గా ప్రాక్టిస్ చేయడం కేవలం సంపన్నుల అందుబాటు వ్యవహారం అనే పరిస్థితి చాలా కాలంగా ఉందని సిజె తెలిపారు. న్యాయస్థానాలలో ఇప్పటికీ మౌలిక వ్యవస్థలో లోపాలు, జడ్జిల సంఖ్య తక్కువగా ఉండటం వంటి పలు అంశాలు న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై ఎంతగానో ప్రభావం చూపుతాయని జస్టిస్ రమణ తెలిపారు.

లా అనేది సంపన్నులే ఎంచుకునే వృత్తి అనే భావన చాలాకాలంగా ఉంటూ వచ్చిందని చెప్పిన ప్రధాన న్యాయమూర్తి మహిళల సంఖ్య కూడా తక్కువగా ఉండటం ఈ వృత్తిలో కొట్టొచ్చే పరిణామం అన్నారు.జుడిషియరీలో, న్యాయవాద వృత్తిలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేదని తాను తరచూ చెపుతున్నానని అన్నారు. అయితే ఈ కీలకమైన లా ప్రొఫెషన్‌లో అతి కష్టం మీద కొంత మార్పు వచ్చిందని అన్నారు. సుప్రీంకోర్టులో 11 శాతం మేర మహిళలకు ప్రాతినిధ్యం దక్కిందని, ఇది నామమాత్రంగానే భావించాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఇటీవలే సుప్రీంకోర్టుకు తొమ్మండుగురు జడ్జీలుగా వచ్చారు. బాధ్యతలు తీసుకున్నారు. ఒకేసారి ఇంత మంది జడ్జిలు రావడం, వీరిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండటం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. లా వృత్తిని మహిళలు ఎంచుకోవడంలో పలు కారణాలతో మహిళలు ముందుకు రాలేదు. ఇక ఈ వృత్తిలోకి వచ్చిన మహిళలు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను పనిచేసిన హైకోర్టులలో మహిళలకు కనీస సౌకర్యాలు లేకపోవడం తాను గమనించానని, కనీసం వారికి టాయ్‌లెట్లు కూడా కల్పించలేకపొయ్యారని తెలిపారు. మహిళా లాయర్లు పలు విధాలుగా బాధలు పడ్డారని గుర్తు చేశారు. తాను జడ్జిగా ఉన్నప్పుడు పరిస్థితిని మెరుగుపర్చేందుకు, వనరులను పెంచేందుకు కృషి చేసినట్లు తెలిపారు. ఈ వృత్తిలో స్థిరత్వం లేదనే వాదన కీలకమైనదని, దీనికి గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరని తెలిపిన ప్రధాన న్యాయమూర్తి , కోర్టులలో మౌలిక సాధనాసంపత్తి గురించి తాను తన విశ్లేషణతో కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజుకు సమగ్ర నివేదిక అందిస్తామన్నారు. వివిధ ప్రాంతాలలో కోర్టులలో మౌలిక వాస్తవిక పరిస్థితులను తెలుసుకుంటున్నామని, వచ్చే కొద్ది వారాలలోనే న్యాయ శాఖ మంత్రికి వివరాలతో నివేదిక అందిస్తామని, ఇందులో జడ్జిల కొరత ప్రధాన అంశంగా ఉంటుందని, మంత్రి సముచిత స్పందన ఉంటుందని ఆశిస్తున్నామని తెలిపారు.

న్యాయవాద వృత్తి పట్టణ పరిమితం

పలు కారణాలతో న్యాయవాద వృత్తి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించలేదు. ఇది ఇప్పటివరకూ కేవలం నగరాలు, పట్టణ ప్రాంతాలకు పరిమితం అయిందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. నిజానికి గ్రామీణ ప్రాంతాల జనమే ఎక్కువగా న్యాయం కోసం న్యాయస్థానాలను, న్యాయవాదులను ఆశ్రయించాల్సి ఉంటుందని , అయితే న్యాయవాద వృత్తి కొన్ని ప్రాంతాలకు కేంద్రీకృతం కావడం కీలక పరిణామం అయిందని తెలిపారు. తనను సన్మానించిన లాయర్లకు ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ కృతజ్ఞతలు తెలిపారు. తాను నడిచివచ్చిన న్యాయవాద వృత్తి మూలాలను తాను మరిచిపొయ్యేది లేదన్నారు. వివిధ హైకోర్టులలో న్యాయమూర్తుల ఖాళీలు గురించి తాను ప్రభుత్వానికి తమ కొలీజియం ద్వారా నివేదించడం జరిగిందని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ఈ వ్యవస్థ ద్వారా ఒకేసారి 68 జడ్జిలను 12 హైకోర్టులకు తీసుకోవడం గురించి సిఫఱాఉ్స చేశారు. ఇందులో పది మంది మహిళల పేర్లు కూడా ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News