Saturday, April 27, 2024

ఆ పదవికి కొత్తగా ఎన్నికలు అవసరం లేదు

- Advertisement -
- Advertisement -

ఎన్నిక ఫలితంపై వివాదం పరిష్కారానికి యత్నం
ఆ 8 బ్యాలట్ పత్రాలను నేడు సుప్రీం ముందు ఉంచాలి
సిజెఐ డివై చంద్రచూడ్ ఆదేశం

న్యూఢిల్లీ : క్రితం నెలలో వివాదాస్పదంగా మారిన మేయర్ ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారి చర్య వల్ల చెల్లుబాటు కాని ఎనిమిది బ్యాలట్ పత్రాలను మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టుకు సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ సోమవారం సాయంత్రం ఆదేశించారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక ఆప్, బిజెపి మధ్య తీవ్ర రాజకీయ, న్యాయ పోరాటానికి దారి తీసిన విషయం విదితమే. ఎన్నిక ఫలితంపై వివాదం పరిష్కారానికి తాము ప్రయత్నిస్తుందున ‘కొత్తగా ఎన్నిక అవసరం లేదు’ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు వేసిన ఎనిమిది బ్యాలట పత్రాలను సరైన కారణం లేకుండా ‘చెల్లుబాటు కానివిగా’ ప్రకటించిన అనంతరం భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి మనోజ్ సోంకర్ నాలుగు వోట్ల తేడాతో మేయర్‌గా ఎన్నికయ్యారు. ‘దీనికి సంబంధించి మేము చేసే ప్రతిపాదన ఏమిటంటే ఏ రాజకీయ పార్టీతోను అనుబంధం లేని వ్యక్తిని కొత్త రిటర్నింగ్ అధికారిగా నియమించాలని డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశిస్తున్నాం. ఫలితాల ప్రకటనకు ముందు నిలచిపోయిన దశ నుంచి తుది ముగింపునకు ఆ ప్రక్రియ దారి తీయాలి’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

‘(ఒరిజినల్) రిటర్నింగ్ అధికారి (అనిల్ మసీహ్) రాసిన గుర్తుతో సంబంధం లేకుండా ఫలితాలు ప్రకటించనివ్వండి. ఆ ప్రక్రియను (పంజాబ్, హర్యానా) హైకోర్టు జ్యుడీషియల్‌గా పర్యవేక్షించనివ్వాలి’ అని సిజెఐ సూచించారు. దీనిపై చండీగఢ్ పాలనా యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘కొన్ని చినిగిపోవడమో లేక ఏవో గుర్తులు వేయడమో జరిగిందని నాతో చెప్పారు. హైకోర్టును పరిశీలించనివ్వండి’ అని పేర్కొనగా సుప్రీం కోర్టు తన వైఖరి మార్చుకోలేదు. పిటిషనర్ ఆప్ మేయర్ పరాజిత అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఎనిమిది బ్యాలట్ పత్రాలను మాత్రమే అధ్యయనం చేయవలసి ఉంటుందని సూచించారు. ‘అవి చిరిగి పోలేద’ని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News