Sunday, April 28, 2024

ప్రధానే ప్రభుత్వాలను కూల్చుతున్నారు!

- Advertisement -
- Advertisement -

అరాచకమా.. రాజకీయమా?

ఇప్పటికే 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేశారు మరో మూడింటిని కూల్చడానికి ప్రయత్నాలు కేంద్రంలో
దరిద్రపుగొట్టు ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి బిజెపి ప్రభుత్వం
ఒక్కటంటే ఒక్క మంచి పనిచేసిందా? మోడీ గొప్పోడైతే దేశంలో 24 గంటల కరెంటు ఎందుకు
ఇవ్వడం లేదు మత పిచ్చిగాళ్లను, రక్త పిశాచులను తరిమికొడితేనే దేశానికి విముక్తి మీ ఆశీర్వాదంతో
జాతీయ రాజకీయాల్లో జెండా ఎత్తుతా కేంద్రంలోని బిజెపి సర్కారును సాగనంపేందుకు ఇక్కడి నుంచే శ్రీకారం
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్:  దేశాన్ని అభివృద్ధి నడిపించాల్సిన ప్రధాని నరేం ద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతున్నారని ము ఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మండిపడ్డారు. గురువారం కొంగరకలాన్‌లో కొత్త గా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనసముదాయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం దేశం లో నిరంకుశ పోకడలను చూస్తున్నామన్నారు. ఇలా నే చూస్తూ ఉందామా? లేక పిడికిలెత్తి పోరాడుదా మా? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక్క మంచిపని కూడా చేయలేదని విమర్శించారు.

దళితులకు, గిరిజనులకు, మహిళలకు, బలహీనవర్గాలకోసం మోడీ సర్కారు ఒక్క మంచిపని అయినాచేసిందా? అని ప్రశ్నించారు.కనీసం మంచినీళ్లు ఇచ్చే తెలివి కూడా కేంద్రానికి లేదని మండిపడ్డారు. దేశానికి బిజెపి ప్రభుత్వం గుది బండగా మారిందన్నారు. మోడీ ప్రభుత్వాన్ని  ఎంత త్వరగా అధికారంలో నుంచి దింపితే దేశానికి అంత మేలు జరుగుతుందన్నారు. అది తనతోనే ప్రారంభం అవుతుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. మోడీ ఎప్పుడు చూసినా చాలా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. తాను సిఎం అయినప్పుడే ఆయన కూడా ప్రధాని అయ్యారన్నారు. కానీ తెలంగాణ లెక్క దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు మంచినీళ్లు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశ రాజధానిలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారో మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు పాలనపై కంటే రాష్ట్రాలపై పెత్తనం చెలాయించడంపైనే దృష్టి సారించడం సిగ్గుచేటని విమర్శించారు.

ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశంలో కనీసం ఒక్క నీటి ప్రాజెక్టు అయినా వచ్చిందా? అని కెసిఆర్ సూటిగా నిలదీశారు. కనీసం మంచినీళ్లు ఇచ్చే తెలివి కూడా కేంద్రానికి లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంలో మోడీ బిజిగా ఉన్నారని కెసిఆర్ ఎద్దేవ చేశారు. స్వయంగా ప్రధానే తొమ్మిది రాష్ట్రాలను కూలగొట్టారన్నారు. తాజాగా తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలను కూలగొడతామని బహిరంగంగానే ఆ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నరని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తామనడం సిగ్గుచేటన్నారు. మోడీ ప్రభుత్వ చర్యలను మౌనంగా భరిద్దామా? లేక పిడికిలి బిగించి కొట్లాడుదామా? అని ప్రశ్నించారు. మోడీ అన్ని వ్యవస్థలను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రూ.25 కోట్లు ఇచ్చి శాసనసభ్యులను కొనుగోలు చేస్తామని అంటున్నారని కెసిఆర్ ఆరోపించారు. ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తమిళనాడులో మూడింట రెండో వంతు మెజార్టీతో గెలిచిన స్టాలిన్ సర్కారుతో పాటు పశ్చిమబెంగాల్లోని మమతాబెనర్జీ, ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారును కూలదోసేందుకు మోడీ అప్రజాస్వామికంగా యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇది ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు.

ఓట్ల కోసం దేశంలో గోస పెట్టే పరిస్థితి

ప్రధాని నరేంద్రమోడీ ఎందుకో ఆగంమాగం అవుతున్నారని కెసిఆర్ మండిపడ్డారు. ఆయనకు ఉన్న పదవి చాలదా? అంతకన్న పెద్ద పదవి లేదన్నారు. అలాంటప్పడు నీచ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తుండడం సిగ్గుచేటన్నారు. మోడీ అలా చేస్తుంటే…మనం చూస్తూ ఊరుకుందామా? అని నిలదీశారు. ఓట్ల కోసం భారత దేశాన్ని గోస పెట్టే పరిస్థితి తెస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణపై ఎలాంటి కారుకూతలు కూస్తున్నారో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చడం మోడీకి చేతకాదని సిఎం కెసిఆర్ మండిపడ్డారు.

దీనిపై ఎప్పుడు ఉల్టా…. పల్టా మాట్లాడుతున్నారని విమర్శించారు. రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు నీళ్లు కోసం ఇప్పటి వరకు వంద దరఖాస్తులు ఇస్తే ఉలుకుపలుకు లేదు. సుప్రీంకోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటే నీళ్లు ఇస్తామని ట్రిబ్యునల్‌కు సిఫారసు చేస్తామన్నారన్నారు. కానీ దానిపై కూడా ఎలాంటి స్పందన రాలేదన్నారు. మేము మనుషులం కాదా? దేశంలో తెలంగాణ భాగం కాదా? అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ రాజకీయాల్లో జెండా ఎత్తుతా

మీ అందరి అనుమతి, ఆశీర్వాదంతోనే జాతీయ రాజకీయాల్లో జెండా ఎత్తుతాని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్‌ను సాగనంపేందుకు మన రాష్ట్రం నుంచే శ్రీకారం చుట్టనున్నామన్నారు. మోడీ ప్రభుత్వాన్ని సాగనంపితేనే దేశానికి మేలన్నారు. రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కూడా తెలంగాణ ఉద్విగ్నమైన పాత్రను పోస్తుందన్నారు. జాతీయ రాజకీయాల్లో పిడికిలి ఎత్తుతామన్నారు. దేశ రాజకీయాల్లో ఉజ్వలమైన పాత్ర నిర్వహించి మతపిచ్చిగాళ్లను, రక్త పిశాచులను, అప్రజాస్వామిక పద్ధుతల్లో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టే వారికి కచ్చితంగా ఈ దేశంలో స్థానం లేదని నిరూపించేటటువంటి మహాయజ్ఞంలో తెలంగాణ భాగస్వామ్యం అవుతుందన్నారు. పనికి మాలిన వారు చిల్లర రాజకీయాల కోసం దేశాన్ని ఆగం చేస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. అందువల్లే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మనం తరిమికొట్టాల్సిన అవసరముందన్నారు. అందుకోసం జాతీయ రాజకీయాల్లో తెలంగాణ కీలకపాత్ర పోస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News