Sunday, April 28, 2024

వ్యవసాయ శాఖలో 2 విభాగాలు

- Advertisement -
- Advertisement -

CM KCR Review on the Department of Agriculture

 

బాధ్యులుగా ఇద్దరు ఐఎఎస్ అధికారులు

ఒక విభాగంలో సాగునీరు, విద్యుత్,
ఎరువులు, విత్తనాలు తదితర మౌలిక
సదుపాయాల పర్యవేక్షణ
మార్కెటింగ్‌పై మరో విభాగం దృష్టి
సాగులో సంస్థాగత మార్పులు
అవశ్యం వ్యవసాయశాఖపై సమీక్ష
సమావేశంలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నదని, దీనికి తగ్గట్టుగా వ్యవసాయశాఖ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు చేసి ఐఎఎస్ అధికారులను బాధ్యులుగా నియమించాలని ఆదేశించారు. వర్షాకాలం పంటలను కొనుగోలు చేయడానికి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పారు. ప్రగతిభవన్ లో శుక్రవారం సిఎం కెసిఆర్ వ్యవసాయశాఖపై సమీక్ష చేశారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు జనార్దన్ రెడ్డి, నర్సింగ్ రావు, రామకృష్ణారావు, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం విసి ప్రవీణ్ రావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, నీటిపారుదలశాఖ ఇఎన్‌సి మురళీధర్ రావు, ఎడి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 60శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నదన్నారు. వ్యవసాయరంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుంటుందన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరొకటి లేదని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, క్లస్టర్ల ఏర్పాటు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం తదితర చర్యల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందటి పరిస్థితితో పోల్చుకుంటే వ్యవసాయరంగం ముఖచిత్రమే మారిపోయిందన్నారు. దేశంలోనే అత్యధికంగా వరిపంట పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నదన్నారు. ఇంకా మిగతా పంటల్లో కూడా ఎంతో పురోగతి ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ లో వ్యవసాయరంగం ఇంకా అభివృద్ధి చెందుతుందన్నారు. నిర్ణీత పంటలసాగు విధానం ద్వారా రైతులకు మంచి ధర వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయరంగం అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగంగా నిలుస్తున్నదన్నారు. వ్యవసాయశాఖ బాధ్యతలు కూడా ఎంతో పెరుగుతున్నాయన్నారు.

వ్యవసాయ శాఖలో సంస్థాగత మార్పులు

వ్యవసాయశాఖలో సంస్థాగత మార్పులు జరగాలని సిఎం కెసిఆర్ సూచించారు. ఇందులో భాగంగా కొత్తగా రెండు ప్రత్యేక విభాగాలకు ఏర్పాటు చేయాలన్నారు. ఒక విభాగం సాగునీరు, విద్యుత్, ఎరువులు, విత్తనాలు తదితర వ్యవసాయ మౌలిక సదుపాయాలను పర్యవేక్షించాలన్నారు. ఆయా శాఖలతో సమన్వయం కుదుర్చుకోవాలని సిఎం పేర్కొన్నారు. మరో విభాగం మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఉంది? ఏ పంట వేస్తే రైతులకు లాభం? తదితర విషయాలను అధ్యయనం చేయాలన్నారు. మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లయీస్, వ్యాపారులతో సమన్వయం కుదుర్చుకొని రైతులకు మంచిధర వచ్చే విధంగా వ్యూహాలు రూపొందించాలని అన్నారు. ఈ రెండు విభాగాలకు ఐఎఎస్ అధికారులు నేతృత్వం వహించాలని సిఎం ఆదేశించారు.

ప్రాజెక్టుల వల్ల జిల్లాలు సుభిక్షంగా మారాయి

గోదావరిపై నిర్మించిన కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల వల్ల 24 జిల్లాలు సుభిక్షంగా మారాయని సిఎం కెసిఆర్ అన్నారు. వీటికి ఇక సాగునీటికి ఢోకా ఉండదన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట,సంగారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ, భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాలు గోదావరి ప్రాజెక్టుల కింద కవర్ అవుతున్నాయన్నారు. కృష్ణా నదిపై కట్టే ప్రాజెక్టుల ద్వారా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు సుభిక్షంగా మారబోతున్నాయని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు ఒకేసారి నీళ్లు రావన్నారు. ఒక్కో ప్రాజెక్టు ఒక్కో సమయంలో నిండటం వల్ల ఆయా ప్రాంతాల్లో పంటకాలాల్లో స్వల్ప తేడాలు ఉంటాయన్నారు. దీనికి అనుగుణంగానే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలి, పంటల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని సిఎం సూచించారు.

ధర వచ్చే పంటలే వేయాలి

‘రాష్ట్రంలో రైతులు ఇప్పటిదాకా కొన్ని రకాల పంటలు వేయడానికి మాత్రమే అలవాటు పడ్డారని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ పద్ధతి మారాలన్నారు. మార్కెట్లో మంచి ధర వచ్చే పంటలు వేయాలని సూచించారు. నిర్ణీత పంటల సాగు విధానాన్ని సూచిస్తున్నవి అందుకే అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. వరి, పత్తితోపాటు కొన్ని పంటల సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో కందులసాగు 20 నుండి 25 లక్షల ఎకరాల వరకు సాగవ్వాలన్నారు. 12 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్, 15 లక్షల ఎకరాల్లో మిరప, పసుపు, ఇతర పప్పుధాన్యాలు, కూరగాయలు తదితర పంటలు సాగవ్వాలన్నారు. నీటి లభ్యత, భూముల రకం, వాతావరణం, మార్కెటింగ్ అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎప్పటికప్పుడు ఏ పంటలు వేయాలనే విషయంలో అధికారులు దిశానిర్దేశం చేయాలని సిఎం కెసిఆర్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News